హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): ఒక ప్రభుత్వ పనితీరుకు ఏమిటి కొలమానం? తాను చేయగలిగిన పనిని, వీలైనంత వేగంగా చేయడమే గీటురాయి. సీఎం కేసీఆర్ ప్రభుత్వం సత్వర స్పందన విషయంలో ఇప్పటికే ఎన్నో కొత్త పుంతలు తొక్కింది. తాజాగా మెట్రో రైలువేళల విషయంలో ప్రభుత్వ స్పందన మెరుపు వేగానికి ప్రతీకగా నిలిచింది.
కరోనా సంక్షోభం తర్వాత మెట్రోరైళ్లు రోజూ ఉదయం 6 గంటలకు బదులుగా 7 గంటలకు మొదలవుతున్నాయి. దీనివల్ల చాలామంది ఉద్యోగులు, ఇతరులు ఇబ్బందులు పడుతున్నారని ఓ ప్రయాణికుడు ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్కు నవంబర్ 8 ఉదయం 6.59 గంటలకు విన్నవించారు.
మంత్రి 8.31 గంటలకు ఆ ట్వీట్ చూశారు. మెట్రో రైల్ అధికారులకు వెంటనే సూచనలు చేశారు. మెట్రో రైలు అధికారులు 10వ తేదీ నుంచి ఉదయం ఆరింటికే మూడు కారిడార్లలో సేవలు మొదలుపెడుతున్నట్టు నవంబర్ 9 సాయంత్రం 3.55 గంటలకు నిర్ణయం తీసుకున్నారు. ఈ వార్త మీరు చదివే సమయానికి ఉదయం ఆరింటి రైలు బయలుదేరిపోయి ఉంటుంది. అంటే సమస్యకు పరిష్కారం 33 గంటల్లోపే అమల్లోకి వచ్చేసిందన్న మాట. ఈ సత్వర స్పందన సర్కారు వేగానికి మరో మైలురాయిలా నిలుస్తుంది.