హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ)/ ఉస్మానియా యూనివర్సిటీ: డ్రోన్ టెక్నాలజీలో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉన్నదని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) చైర్మన్ డాక్టర్ సతీశ్రెడ్డి చెప్పారు. దేశ విద్యారంగంలో ఓయూ సమున్నత స్థానాన్ని కలిగి ఉన్నదని అన్నారు. ఓయూకు అనుబంధంగా ఉన్న పరిశోధనా సంస్థలు రక్షణరంగంలో కీలకపాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ 81వ స్నాతకోత్సవం ఠాగూర్ ఆడిటోరియంలో బుధవారం ఘనంగా జరిగింది. దీనికి వర్సిటీ చాన్స్లర్ హోదాలో గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్, ముఖ్యఅతిథిగా డీఆర్డీవో చైర్మన్, కేంద్ర రక్షణ పరిశోధన, అభివృద్ధిశాఖ కార్యదర్శి డాక్టర్ జీ సతీశ్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సతీశ్రెడ్డి మాట్లాడుతూ.. ఎంతో మంది గొప్పగొప్ప వ్యక్తులు ఓయూలో చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరారని గుర్తు చేశారు. తనకు కూడా 1986 నుంచి ఓయూతో అనుబంధం ఉన్నదని, పరిశోధనల నిమిత్తం వర్సిటీలోని నావిగేషన్ ఎలక్ట్రానిక్స్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ యూనిట్ (ఎన్ఈఆర్టీయూ)కు క్రమం తప్పకుండా వచ్చేవాడినని చెప్పారు. యూనివర్సిటీల్లో లోతైన పరిశోధనలు జరుగాలని, అందుకు విద్యార్థులను సన్నద్ధం చేయాల్సిన బాధ్యత అధ్యాపకులపైనే ఉన్నదని అన్నారు. మన దేశంలో ఉత్పత్తి చేసే వస్తువులు ఏ దేశంలోనైనా అమ్మగలిగేలా ఉండాలని, తద్వారా విదేశీ మారకద్రవ్యం సైతం పెరుగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా గవర్నర్, డీఆర్డీవో చైర్మన్ 35 బంగారు పతకాలతోపాటు పీహెచ్డీ పూర్తిచేసిన 319 మందికి పట్టాలను ప్రదానం చేశారు. సమాచార హక్కు చట్టం కమిషనర్ గుగులోతు శంకర్నాయక్ డాక్టరేట్ పట్టా పుచ్చుకున్నారు. ఎంసీఆర్హెచ్చార్డీ ఉద్యోగిని కందుకూరి ఉషారాణి కెమిస్ట్రీలో పీహెచ్డీ పట్టా అందుకున్నారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్, ఇఫ్లూ వీసీ ప్రొఫెసర్ ఇ సురేశ్కుమార్, జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి, మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ గోపాల్రెడ్డి, తెలంగాణ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ రవీందర్గుప్తా తదితరులు పాల్గొన్నారు.
పీహెచ్డీ పట్టా సాధించిన 92 ఏండ్ల కాలె
విద్యార్జనకు వయసుతో పనిలేదని నిరూపించారు కామారెడ్డి జిల్లా మద్నూర్కి చెందిన రామచందర్రావు కాలే. 92 ఏండ్ల వయసులో ఆయన ఓయూ స్నాతకోత్సవంలో పీహెచ్డీ పట్టా పొందారు. ‘ఓంప్రకాశ్ వాల్మీకి కే సాహిత్య్ మే చిత్రిత్ దళిత్ చేతన’ అనే అంశంపై పరిశోధన కాలె పరిశోధన చేశారు. హిందీ (ఓరియంటల్) విభాగంలో పీహెచ్డీ పూర్తి చేశారు. ఆయన కుమారుడు డాక్టర్ శక్తిరాజ్ సైతం హిందీలో ఇఫ్లూ నుంచి పీహెచ్డీ సాధించాడు. ‘1954లో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను కలిసి ఆశీర్వాదం సైతం పొందాను. 92 ఏండ్ల వయసులో పీహెచ్డీ పూర్తి చేయడం గర్వంగా ఉంది’ అని కాలె తెలిపారు.