హైదరాబాద్ : రాబోయే 10-15 రోజుల్లో హైదరాబాద్ను వంద శాతం కోవిడ్ వాక్సినేషన్ జరిగిన నగరంగా చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి, జీహెచ్ఎంసీ కమిషనర్, జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న నాలుగు జిల్లాల కలెక్టర్లు, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, డీఎంహెచ్వోలు, ఎస్పీహెచ్వోలతో నగరంలోని బీఆర్కేఆర్ భవన్లో గురువారం వర్క్షాప్ నిర్వహణ జరిగింది.
ఈ సందర్భంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. నగరంలోని అన్ని కాలనీలను 100% వాక్సినేషన్ కాలనీలుగా తీర్చిదిద్దేందుకు శాసనసభ్యులు, స్థానిక కార్పొరేటర్లను భాగస్వాములను చేస్తూ, జీహెచ్ఎంసీ, ఆరోగ్యశాఖల అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. ఇంటింటికి తిరిగి సర్వే జరిపి 18 సంవత్సరాలపై బడిన అర్హత కలిగిన వ్యక్తులను మాప్ అప్ చేయాలని తెలిపారు. ఒక ఉద్యమముగా ఈ కార్యక్రమం చేపట్టాలని ఆదేశించారు.
మొబైల్ వాక్సినేషన్కు మంచి స్పందన వస్తున్నట్లు తెలిపారు. అదే స్ఫూర్తితో ఇంటింటికి తిరిగి మిగిలిన వ్యక్తులకు వాక్సినేషన్ చేసేందుకు సిబ్బంది, మెటీరియల్తో కాలనీల వారీగా టీంలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ ఎస్. హరీష్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం. హన్మంత రావు, డైరెక్టర్, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డా.శ్రీనివాస్ రావు, ఓఎస్డి టు సీఎం డా.గంగాధర్, హైదరాబాద్ డీఎంహెచ్వో డాక్టర్ వెంటటి, రంగారెడ్డి డీఎంహెచ్వో డాక్టర్ స్వరాజ్య లక్ష్మి, మేడ్చల్ మల్కాజిగిరి డీఎంహెచ్వో డాక్టర్ మల్లికార్జున్, సంగారెడ్డి డీఎంహెచ్వో డా. గాయత్రి తదితర అధికారులు పాల్గొన్నారు.