సిటీబ్యూరో, నవంబర్ 21(నమస్తే తెలంగాణ): సొసైటీలోని అసమానతలకు చెక్ పెట్టేందుకు 2009లో స్ట్రీట్ కాజ్ అనే ఆర్గనైజేషన్ ప్రారంభమైంది. ఇందులో భాగంగానే హైదరాబాద్ యూత్ అసెంబ్లీ (హెచ్వైఏ)ని 2011లో ప్రారంభించారు. ప్రస్తుతం 11వ యూత్ అసెంబ్లీ కార్యక్రమాన్ని హైదరాబాద్లో నిర్వహించింది. ప్రతిఏడాది రెండు దఫాలుగా అసెంబ్లీ అవుతారు. మొదటి ఫేజ్ నవంబర్, సెకండ్ ఫేజ్ ఫిబ్రవరిలో నిర్వహిస్తారు. ఐక్యరాజ్య సమితి సూచించిన 16 అంశాల్లోని ఎనిమిదింటిని ఎంపిక చేసుకుంటారు. మొదటి ఫేజ్లో 4, రెండో ఫేజ్లో 4 చొప్పున యూత్ అసెంబ్లీ ఎంచుకున్న అంశాలపై పనిచేస్తుంది. ప్రస్తుత తరుణంలో విద్యార్థులకు సమాజం, భవిష్యత్పై అవగాహన కల్పించేందుకు యూత్ అసెంబ్లీ ఎంతగానో తోడ్పడుతుంది.
పర్యావరణ పరిరక్షణకు నిర్మాణాత్మక పోరు అవసరమని జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు. స్ట్రీట్ కాజ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 11వ హైదరాబాద్ యూత్ అసెంబ్లీ కార్యక్రమాన్ని ఆదివారం జీపీ బిర్లా కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పుల్లెల గోపీచంద్ మాట్లాడుతూ, విద్యార్థి ఆలోచనలను ప్రతిబింబించేందుకు ‘హైదరాబాద్ యూత్ అసెంబ్లీ’ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతందన్నారు. స్ట్రీట్ కాజ్ ఆర్గనైజేషన్ను విద్యార్థులే ఒక యూనిట్గా ఏర్పడి నడపడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు సూచనలు, సలహాలు చేశారు. అనంతరం, విద్యార్థులు మాట్లాడుతూ, సమాజంపై వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
విద్యార్థి దశలోనే సేవ చేయాలి
హైదరాబాద్ యూత్ అసెంబ్లీలో పాల్గొనడం ఇదే మొదటి సారి. ఎంతో ఉత్సాహంగా ఉంది. విద్యార్థి దశ నుంచే సేవా గుణాన్ని అలవర్చుకోవాలి. చదువే జీవితం కాకుండా ప్రతి విషయాన్ని నిలకడగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మనకు ఉన్నంతలో కొంత సమాజానికి తోడ్పాటునందించాలి.
యూఎన్వో లక్ష్యాల కోసం పనిచేస్తాం..
నేను నాలుగో యూత్ అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొన్నాను. కొన్నేండ్లుగా నాణ్యమైన విద్య, ఆకలి లేని సమాజం, పేదరికాన్ని రూపుమాపడం, ప్రధానంగా పర్యావరణ మార్పులు, పరిణామాలపై పనిచేస్తున్నాం. చదువుకుంటూనే, సమాజంలోని అసమానతలను నిర్మూలించేందుకు ఐక్యరాజ్య సమితి లక్ష్యాల కోసం స్ట్రీట్ కాజ్ ద్వారా కృషి చేస్తున్నాం.
సేవ చేయడానికి ఇదో ప్లాట్ఫాం
విద్యార్థి జీవితంలో సమాజానికి సేవ చేయడానికి ఇదో మంచి ప్లాట్ఫాం. ప్రధానంగా ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న వాతావరణ మార్పులను అంచనా వేసి ముందుకుసాగాలి. పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత తీసుకుంటేనే భవిష్యత్ తరాలకు మంచి అవకాశాలను అందివ్వగలుగుతాం. అందుకోసం కృషి చేస్తున్నాం.
భవిష్యత్ విద్యార్థులదే హైదరాబాద్ యూత్ అసెంబ్లీలోమంత్రి శ్రీనివాస్గౌడ్ రాబోయే కాలమంతా నేటి విద్యార్థులదేనని హైదరాబాద్ యూత్ అసెంబ్లీలో టూరిజం, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. స్ట్రీట్ కాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన హైదరాబాద్ యూత్ అసెంబ్లీ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. విద్యార్థులు రాజకీయాలపై చర్చించడం ద్వారా దేశ పోకడ అవగతమవుతుందన్నారు. ఇటువంటి అసెంబ్లీ సమావేశాల వల్ల జ్ఞానం వికసిస్తుందన్నారు. తెలంగాణ గురుకులాల నుంచి ఎంతో మంది విద్యార్థులను దేశంలో ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్లకు ఎంపికయ్యారని గుర్తు చేశారు.
20-30 విజన్తో పనిచేస్తున్నాం
20-30 విజన్తో దేశంలోని 30 నగరాల్లో సేవ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దేశ వ్యాప్తంగా అన్ని నగరాల్లో సంస్థ కార్యక్రమాలను రూపొందించి, విద్య, ఆరోగ్యం, పర్యావరణ కాలుష్యంపై అవగాహన పెంచేందుకు కృషి చేస్తున్నాం. స్ట్రీట్ కాజ్లో చాలా యూనిట్లు ఉన్నాయి. అందులో భాగమే హైదరాబాద్ యూత్ అసెంబ్లీ.