రవీంద్రభారతి, నవంబర్ 21: కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి.. తెలంగాణను సస్యశ్యామలం చేసి.. సీఎం కేసీఆర్ అపర భగీరథుడిగా కీర్తినార్జించారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఆదివారం రవీంద్రభారతిలో తెలంగాణ వికాస సమితి- చేతన సాహితీ సమాఖ్య ఆధ్వర్యంలో ‘మల్లావఝుల సదాశివుడు స్మారక పురస్కార ప్రదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ సదాశివుడు గొప్ప ప్రజాకవి అని.. కోల్బెల్ట్ ప్రాంతంలో ఉద్యమాల్లో చురుకుగా పాల్గొని.. ప్రజలను చైతన్యం చేసిన గొప్ప మహనీయుడన్నారు. అణగారిన వర్గాలు, దళితులు, మహిళల కోసం పోరాటాలు చేసి.. అనేక కవిత్వాలు రాశారని గుర్తు చేశారు. అనంతరం పురస్కార గ్రహీతులు వెంకట్ కవి, సుబ్బయ్యలకు మల్లావఝుల సదాశివుడు స్మారక పురస్కారాలను అందజేసి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సీఎంవో ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.