హిమాయత్నగర్, నవంబర్ 21: తెలంగాణ రాష్ర్టాన్ని ఫిష్బోల్గా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండా ప్రకాశ్ ముదిరాజ్ స్పష్టం చేశారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం, మహాసభ 8వ ఆవిర్భావ వేడుకలు ఆదివారం హిమాయత్నగర్లోని బీసీ భవన్లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బండా ప్రకాశ్ ముదిరాజ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ముదిరాజ్ కులస్తులు ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో వెనుకబడి ఉన్నారని ఈ వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని కృషి చేస్తుందని తెలిపారు. మహాసభ ఆవిర్భావం నుంచి మత్య్సకారులు, ముదిరాజ్ల సమస్యల పరిష్కారం కోసం ఎంతో కృషి చేసిందని వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను దేశ వ్యాప్తంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్లినట్లు తెలిపారు. కేంద్రంలో ప్రత్యేక మత్స్యకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని పార్లమెంట్లో తాను ప్రస్తావించగా కేంద్రం స్పందించి ఏర్పాటు చేసిందని తెలిపారు. ముదిరాజ్ కులస్తులను బీసీ (డీ) నుంచి బీసీ(ఎ)కు మార్చటం, ప్రత్యేక రిజర్వేషన్ సాధించేందుకు కృషి చేస్తానని చేప్పారు. ముదిరాజ్ కులస్తులు ఐక్యమై ప్రభుత్వ పరంగా వచ్చే హక్కులను సాధించుకుని ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో మహాసభ రాష్ట్ర యువత విభాగం అధ్యక్షుడు గుండ్లపల్లి శ్రీను, మహాసభ గ్రేటర్ అధ్యక్షుడు పోల్కం లక్ష్మీనారాయణ, యువత ప్రధాన కార్యదర్శి అల్లుడు జగన్ ముదిరాజ్, నాయకులు బొక్కా శ్రీనివాస్, ప్రశాంత్, డాక్టర్ పరమేశ్ పాల్గొన్నారు.