చిక్కడపల్లి, నవంబర్ 21: కళలు, కళాకారులను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని, కళల పట్ల ఆయన సేవలు అమోఘమని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు అన్నారు. భారత్ ఆర్ట్స్ అకాడమీ, ఏబీసీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నటరాజ పాద మంజీర పేరిట నాట్య ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వకుళాభరణం మాట్లాడారు. సీఎం కేసీఆర్ తెలంగాణ కళలు, కళారూపాలను, సంస్కృతిని, భాషను ప్రత్యేక చొరవతో ఆదరిస్తున్నారని అన్నారు. పేరిణి నాట్యాన్ని రాష్ట్ర నాట్యంగా గుర్తించడం గొప్ప విషయం అన్నారు. పేరిణి నాట్యం, శివ తాండవం ఆంధ్ర నాట్య ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పలువురు నాట్య గురువులకు అవార్డులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో సరస్వతి ఉపాసకులు దైవజ్ఞ శర్మ, విశ్రాంత ప్రొఫెసర్ మసన చెన్నప్ప, ఏబీసీ ఫౌండేషన్ అధ్యక్షుడు లయన్ కేవీ రమణారావు, భారత్ ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షురాలు లయన్ లలితారావు, మారుతి వరుణ్ పాల్గొన్నారు.