సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/మెహదీపట్నం, మార్చి 12 (నమస్తే తెలంగాణ) : కంటోన్మెంట్ రోడ్లపై మంత్రి కేటీఆర్ మళ్లీ గళం విప్పారు. ఏడేండ్లుగా కంటోన్మెంట్లో తరచూ రోడ్లను మూసివేస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న కేంద్ర ప్రభుత్వ తీరుపై శనివారం శాసనసభ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు నయా పైసా సాయం చేయకపోగా… అభివృద్ధికి ఆటంకం కలిగించడంతో పాటు సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేయడంపై మండిపడ్డారు. గతంలో అనేకసార్లు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయడంతో పాటు ఢిల్లీకి వెళ్లిన సందర్భంలో నేరుగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి, మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులకు కూడా మంత్రి కేటీఆర్ ఈ సమస్యపై విన్నవించారు. ప్రజా శ్రేయస్సు దృష్ట్యా సమస్యను పరిష్కరించాలని కోరారు. కానీ కేంద్రం నుంచి స్పందన కనిపించలేదు. ఈ నేపథ్యంలో అనేకసార్లు సోషల్ మీడియా ద్వారా కేంద్ర మంత్రుల దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లారు. అయినప్పటికీ కేంద్రం విననట్లుగానే వ్యవహరిస్తున్నది. కంటోన్మెంట్లోని ఆర్మీ అధికారులు ఇష్టానుసారంగా రోడ్లను మూసివేయడం, నాలాలపై చెక్డ్యాంలను నిర్మించడంతో పాటు కంటోన్మెంట్ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. దీంతో విసుగెత్తిన మంత్రి కేటీఆర్… కఠిన నిర్ణయాలు తీసుకుంటేనైనా కేంద్రం దిగొస్తుందని భావించిన ఆయన శాసనసభ వేదికగా తీవ్రస్థాయిలో హెచ్చరించారు. కేటీఆర్ శాసనసభలో మాట్లాడిన వివరాలు ఆయన మాటల్లోనే..
మిలిటరీ ఏరియాలోని బుల్కాపూర్ నాలాలపై చెక్డ్యాం కట్టి నీళ్లు ఆపడంతో నదీం కాలనీ మునిగిపోతోంది. శాతం చెరువు నుంచి గోల్కొండ కిందకు ఏఎస్ఐ అనుమతి తీసుకొని నీళ్లు వదులుదామంటే అక్కడ ఏఎస్ఐ (పురపాలక శాఖ) అనుమతి ఇవ్వదు. ఒకవైపు కంటోన్మెంట్.. మరో వైపు ఏఎస్ఐ అడ్డు పడుతుంది. ఇది మంచి పద్ధతి కాదు. తెలంగాణ ఏదో వేరే దేశమైనట్లు కేంద్రం విచ్చలవిడిగా ప్రవహరిస్తున్నది. గతంలో అనేకసార్లు విన్నవించాం… కానీ వాళ్లు (కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ) సరైన రీతిలో అర్థం చేసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో మేం కూడా ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ముంది. అవసరమైతే కరెంటు కట్ చేస్తాం, నీటి సరఫరా బంద్ చేస్తాం (కంటోన్మెంట్లో రక్షణ శాఖ అధికారులు ఉండే లోకల్ మిలిటరీ అథారిటీ ఏరియాకు). ఏం చేస్తారో చూద్దాం. ఎందుకంటే హైదరాబాద్లో ఉన్నప్పుడు అందరూ కలిసిమెలిసి ఉండాలిగానీ మా ఇష్టం వచ్చినట్లు రోడ్లు బంద్ చేస్తం, ఇష్టం వచ్చినట్లు నాలాల మీద చెక్డ్యాంలు కడతామంటే మేం కూడా ఊరుకోం. ప్రజల కోసం ఎంతకైనా తెగిస్తాం. కరెంటు, నీళ్లు బంద్ చేస్తనైనా దిగొస్తారేమో చూస్తాం. పురపాలక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఇక్కడే (శాసనసభలోనే) ఉన్నారు… వారిని (ఆర్మీ అధికారులు) పిలిచి మాట్లాడండి. ఒకవేళ వాళ్లు వినకపోతే తీవ్రమైన, కఠిన చర్యలకు వెనకాడవద్దని రాష్ట్ర ప్రభుత్వం తరపున శాసనసభ వేదికగా చెప్తున్నా. ప్రజాహితం కోరే వ్యక్తిగా చెబుతున్నా. ఎందుకంటే రాష్ర్టానికి పైసా సాయం చేయరు… పైగా పని చేస్తున్న ప్రభుత్వానికి అవరోధం కలిగించడం సరికాదు.
సివరేజ్ మాస్టర్ప్లాన్ అమలుకు 11 వేల కోట్లు
ఈ నగరంలో 94 శాతం మురికి నీరు కిందికి గ్రావిటీ ద్వారా మూసీలోకి వస్తుంది. నగర ప్రాముఖ్యతను గుర్తించి పూణేకు చెందిన ప్రఖ్యాత షా కన్సల్టెన్సీతో అధ్యయనం చేయించాం. హైదరాబాద్ అంటే ఒక్క జీహెచ్ఎంసీనే కాకుండా ఔటర్ రింగ్ రోడ్ అవతల ఒక కిలోమీటర్ వరకు చేయిస్తున్నాం. సివరేజ్ నెట్వర్క్, పైప్లైన్ లెక్కలు పాత ఎంసీహెచ్లో లేవు. సెక్రటేరియట్ ముందు ఒకసారి అండర్గ్రౌండ్ డ్రైనేజీలో మిథేన్ గ్యాస్ నిండి ఆ పైపు చిద్రమైపోయి కుంగింది. అప్పుడు ఎక్కడెక్కడ ఇలాంటి పరిస్థితి ఉందో లెక్క తీయ మంటే లెక్కలు లేవని చెప్పారు. షా కన్సల్టెన్సీని ఏర్పాటు చేసిన తరువాత మొత్తం లెక్కలు తీయించి, ఇన్వెంటరీ మ్యాపింగ్ చేశాం. ఎంసీహెచ్ పరిధిలో పాతపైప్లైన్ ఎక్కడయితే ఉన్నాయో కొన్ని తక్షణం రీప్లేస్ చేయాల్సి ఉంది. కొన్నేమో స్ట్రెంతెన్ చేయాల్సి ఉందని షా కన్సల్టెన్సీ ప్రతిపాదించి, దానికి అయ్యే ఖర్చు కూడ చెప్పింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ వరకు తీసుకుంటే మొత్తం కలిపి రూ.11వేల కోట్ల వరకు సీవరేజ్ మాస్టర్ ప్లాన్ అమలుకు డబ్బులు అవసరం అవుతాయని కన్సల్టెన్సీ చెప్పింది.
వంద శాతం సివరేజ్ ట్రీట్
కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ముషీరాబాద్ నియోజకవర్గంలో భోలక్పూర్లో తాగునీరు, మురికినీరు కలిసి పోవడం వల్ల దాదాపు 11 మంది మరణించారు. అట్లాంటి ప్రమాదం జరగకూడదని కోర్ సిటీలో అలాంటి 276 పాయింట్లు గుర్తించి రెక్టిఫై చేస్తున్నాం. ఇది వరకు హైదరాబాద్లో 46 శాతం సీవరేజ్ ట్రీట్మెంట్ అయ్యేది. ఇపుడు 100శాతం సివరేజ్ ట్రీట్ చేయాలని రూ.3866 కోట్లతో పనులు చేపట్టి, 37 చోట్ల ఎస్టీపీలు కడుతున్నాం. ఈ డిసెంబర్ వరకు అన్ని పూర్తి చేసి 2000 ఎంఎల్డీల మురుగునీటి శుద్ధి చేసే సామర్థ్యాన్ని సంపాదించుకున్న మొట్టమొదటి నగరంగా హైదరాబాద్ ఆవిర్భవిస్తుంది.
వర్షాకాలం వచ్చేలోగా పనులు పూర్తి
అక్టోబర్ 2020లో వచ్చిన వానలు, వరదల తరువాత ఎస్ఆర్డీపీలాగా వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమాన్ని మిషన్మోడ్లో తీసుకున్నాం. దీనికి నిధులు కేటాయించి, ప్రత్యేకంగా ఇంజినీరింగ్ టీమ్స్ ఏర్పాటు చేశాం. రూ. 985.45 కోట్లతో మొదటిదశలో ఎస్ఎన్డీపీ పనులు తీసుకున్నాం. మొయిన్ చెరువును రూ.22 కోట్లతో మొదటి దశలోనే తీసుకున్నాం. సరూర్నగర్ చెరువు అప్డౌన్ స్ట్రీమ్లు తీసుకొని పని చేస్తాం. ఖైరతాబాద్ నియోజకవర్గంలో నరేంద్ర లూథర్ ఇంటి పక్కన ఎస్టీపీ తప్పకుండా టేకప్చేస్తాం. సీఐబీ క్వార్టర్స్ దగ్గర హుస్సేన్ సాగర్ స్టార్మ్ వాటర్ డ్రైన్ రూ.6.30 కోట్లతో ఎన్ఆర్సీపీ ఫేజ్-2లో తీసుకున్నాం. హుస్సేన్సాగర్ సర్ప్లస్ నాలా రిటైనింగ్ వాల్ రూ.68.40 కోట్లతో పనులు చేపట్టాం. దీని ద్వారా 400 కుటుంబాలకు ఎఫెక్ట్ అవుతుందని చెపితే దాన్ని తగ్గించి హైట్ పెంచి కేవలం 20 కుటుంబాలే ఎఫెక్ట్ అయ్యేలా చేశాం. ఆ కుటుంబాలకు రిహేబిలిటేషన్ కల్పిస్తున్నాం. ఎన్ఆర్డీపీ రెండవ ఫేజ్ కూడ ప్రతిపాదిస్తున్నాం. పనులు జూన్ వరకు పూర్తి చేయడానికి వన్ వీక్ షార్ట్ టెండర్లు పిలిచాం. వర్షాకాలం వచ్చేలోగా ఈ పనులన్నీ పూర్తి చేయాలనే ఉద్దేశంతో ప్రతి వారం రివ్యూ చేస్తున్నాను.
మంత్రి కేటీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ అభివృద్ది
ఎమ్మెల్యే దానం నాగేందర్
బంజారాహిల్స్, మార్చి 12: గతంలో ఎన్నడూ లేని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో హైదరాబాద్ నగరం అభివృద్ధిలో దూసుకుపోతోందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. శనివారం శాసనసభ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో భాగంగా ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలోని వరదనీటి సమస్యలను ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రస్తావించారు. గ్లోబల్ సిటీగా మారుతున్న హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు మంత్రి కేటీఆర్ నాయకత్వంలో ఎస్ఆర్డీపీ పేరుతో రోడ్లను అభివృద్ధి చేయడంతో పాటు ఫ్లైఓవర్ల నిర్మాణం, అండర్పాస్ల నిర్మాణం చేపట్టారని తెలిపారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధిని పట్టించుకోని ప్రతిపక్ష పార్టీల నాయకులు చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు మాత్రం గోరంతలు కొండంతలుగా చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గత ఏడాది భారీ వర్షాల సందర్భంగా ప్రతిపక్ష పార్టీలు చేసిన రాద్ధాంతం అందరూ గమనించారని చెప్పారు. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్రెడ్డి వరద సమస్యలను పరిష్కరించేందుకు ఏ మాత్రం నిధులు తీసుకురాలేదని, మంత్రి కేటీఆర్ మాత్రం నిరంతరం వర్ష ప్రభావిత ప్రాంతాల్లో తిరుగుతూ పరిస్థితిని చక్కదిద్దారని పేర్కొన్నారు.
నోరు మెదపని కేంద్ర మంత్రి..
రాజకీయాలు మాట్లాడేందుకు, తెలంగాణ ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేసేందుకు తరచూ మీడియా ముందుకు వచ్చే సికింద్రాబాద్ పార్లమెంటుసభ్యుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కంటోన్మెంట్ ప్రజల సమస్యలపై మాత్రం నోరు మెదపడం లేదు. ఏడేండ్లుగా నరకయాతన అనుభవిస్తున్న సామాన్య ప్రజల పక్షాన మాట్లాడిన దాఖలాలు లేవు. ముఖ్యంగా కిషన్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు పరిధిలోనే కంటోన్మెంట్ వస్తున్నప్పటికీ… ఏఒక్కనాడూ ఆయన ఈ అంశంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి, ఉన్నతాధికారులను కలవకపోవడం ఆయన నిర్లక్ష్యానికి పరాకాష్టగా పలువురు పేర్కొంటున్నారు. కనీసం మంత్రి కేటీఆర్ తరచూ ఈ అంశంపై గళం వినిపిస్తున్న సందర్భంలోనైనా ఆయన స్పందించకపోవడం విచారకం. ముఖ్యంగా మంత్రి కేటీఆర్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అభివృద్ధి కార్యక్రమాల సందర్భంగా ఒకే వేదికపై ఉన్న సమయాల్లోనూ మంత్రి కేటీఆర్ కంటోన్మెంట్ రోడ్ల సమస్య పరిష్కారంలో చొరవ చూపాలని కిషన్రెడ్డిని కోరారు. కానీ కేంద్ర మంత్రి మాత్రం ఆ చొరవ తీసుకోవడం లేదనేది నగర ప్రజలపై ఆయన చిత్తశుద్ధికి నిదర్శనమని నగరవాసులు వాపోతున్నారు.