చార్మినార్, నవంబర్ 20 : అందివస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని.. ఉన్నతస్థానానికి ఎదగాలని నగర సీపీ అంజనీకుమార్ పిలుపునిచ్చారు. శనివారం దక్షిణ మండల మహిళా పోలీస్స్టేషన్ ఆవరణలో టైం కంపెనీ సహకారంతో ఉమెన్స్ జాబ్ మేళా నిర్వహించారు. మొత్తం ఐదు కంపెనీలు పాల్గొన్న ఈ మేళాకు విశేష స్పందన వచ్చింది. 2,033మంది పేర్లు నమోదు చేసుకోగా, 740 మంది వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. అంతకుముందు కార్యక్రమాన్ని ప్రారంభించిన సీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ జాబ్మేళాలో అర్హులైన వారిని ఉద్యోగాల్లో నియమించుకునేందుకు వివిధ కంపెనీలు ముందుకొచ్చాయన్నారు. నగర పోలీస్ విభాగం ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 20వేలకు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించామని అదనపు సీపీ షికాగోయల్ తెలిపారు. నేడు మహిళలు అన్ని రంగాల్లో సత్తా చాటుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో దక్షిణ మండల డీసీపీ గజారావ్ భూపాల్, షీటీమ్స్ అడిషనల్ డీసీపీ శిరీష, దక్షిణ మండల అదనపు డీసీపీ రఫీక్, చార్మినార్, ఫలక్నుమా ఏసీపీలు భిక్షంరెడ్డి, మాజీద్ పాల్గొన్నారు.