చిన్నతనం నుంచే వ్యాపార ఆలోచనలు వారి మెదళ్లలో నాటుకున్నాయి. చదువు పూర్తయ్యాక ప్రారంభిద్దాం అనుకున్నారు.. ఇంతలోనే పెళ్లి.భర్త సహకారంతో రాణిద్దామనుకున్నారు. పిల్లల పెంపకం రూపంలో మరో సవాల్. వ్యాపార ఆలోచన ఉన్నా.. అమలుకు వీలు చిక్కలేదు. తమ లక్ష్యం కంటే కుటుంబ బాధ్యతనే ముఖ్యమని భావించిన వారు కొందరైతే.. వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఉద్యోగం చేసి.. వచ్చిన జీతంతో నూతన కాన్సెప్ట్స్తో స్టార్టప్లు ఏర్పాటు చేసిన వారు మరికొందరు… బిజినెస్తో డబ్బు సంపాదనే లక్ష్యంగా కాకుండా వినియోగదారుల ఆరోగ్యమే ప్రధాన ధ్యేయంగా హెల్తీ థీమ్స్తో వ్యాపారాలు ప్రారంభించారు ఇంకొందరు.. ఇలా ప్రతీ మహిళా తమకు నచ్చిన రంగంలో రాణించడానికి కృషి చేస్తున్నది. “ఉద్యోగం ఎంత చేసినా అంతే జీతం.. వ్యాపారం ఎంత చేస్తే అంత జీతం” కాన్సెప్ట్తో నగరానికి చెందిన పలువురు మహిళలు వ్యాపారాల్లో దూసుకుపోతున్నారు.
– సిటీబ్యూరో, మార్చి 6 (నమస్తే తెలంగాణ)
జీతం డబ్బులతో వ్యాపారం
హైదరాబాద్లోని కొత్తపేటకు చెందిన వాణి కొమర్రాజుకు చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం అంటే ఇష్టం. ఎక్కువగా బిజినెస్ పుస్తకాలు చదివేది. ఇందూర్బ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్లో పనిచేసింది. అయినా తన మనసంతా వ్యాపారంపైనే. అయితే అందుకు డబ్బు కావాలి.. అది కూడా కష్టార్జితమే కావాలనుకుంది. తన వ్యాపారానికి అవసరమయ్యే డబ్బు సమకూరే వరకు ఉద్యోగం చేసింది. ఉద్యోగమే బాగుంది కదా? ఇక వ్యాపారమెందుకు? అని తెలిసినవాళ్లు చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఆమె పట్టించుకోలేదు. ఉన్న డబ్బుతో ఆమె ‘హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ అండ్ డిజైనింగ్’ స్టార్టప్ను ప్రారంభించింది. చెన్నైలో ఇందుకు సంబంధించిన కోర్సును పూర్తి చేసింది. పూర్తిగా హ్యాండ్వర్క్స్తో విభిన్న రకాల రూపాలను తీర్చిదిద్దడం దీని ప్రత్యేకత. అంటే ఫ్యాబ్రిక్ మీద ప్రింట్ వేయడం.. కర్టన్స్, బ్యాగ్స్, బ్యాంగిల్స్, దుప్పట్లు తదితర వాటిపై కస్టమర్లకు నచ్చేలా హ్యాండ్ వర్క్ చేయడం ప్రారంభించారు. ఇది చేసుకుంటూనే నేచురల్ డయాస్ అనే మరో బిజినెస్ను స్టార్ట్ చేశారు. దీనిలో చెట్టు భాగాల నుంచి రంగులు సేకరించి వాటితో కొత్త డిజైన్లను రూపొదించింది. ఆమె ఆలోచన మరో 14 మందికి ఉపాధిని ఇచ్చింది. అంతటితో ఆగిపోకుండా వంద మంది మహిళలకు తాను నేర్చుకున్న కోర్సును నేర్పించింది. అందులో 30 మంది మహిళలు ఇప్పుడు సొంతంగా వ్యాపారం ప్రారంభించి మరికొందరికి ఉపాధిని ఇస్తున్నారు. వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికోసం ఎంట్రప్రెన్యూర్స్ అనే గ్రూప్ను ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
గర్భిణిగా ఉన్న సమయంలో..!!
డాక్టర్ టీ. నీలిమ. డెంటిస్ట్..అలా అని వృత్తికే పరిమితం కాలేదు. గర్భిణిగా ఉన్నప్పుడు వైద్యుల సూచన మేరకు కొబ్బరినీళ్లు తాగాల్సి వచ్చింది. అయితే అవి వగరుగా, వేడిగా ఉన్నాయని ఆమె తాగడానికి ఇష్టపడలేదు. అప్పుడు తన భర్త కొబ్బరినీళ్లకు ఇతర పండ్ల జ్యూస్లు మిక్స్ చేసి ఇచ్చేవాడు. ఆ రుచి కొత్తగా అనిపించడంతో ఇష్టంగా తాగేది. లేత కొబ్బరితో ఇతర పండ్ల గుజ్జును మిక్స్ చేసి తినేది. అలా తన ఆరోగ్యం చాలా మెరుగయ్యింది. ఆ మిరాకిల్ గ్రహించిన ఆమె ఇలాంటి పోషకాహారం అందరికీ అందించాలనే ఆలోచన చేసింది. అనుకున్నదే తడువుగా కోకోట్యాంగ్ స్టార్టప్ను ప్రారంభించింది. కొబ్బరినీళ్లకు పండ్ల రసాలు, లేతకొబ్బరికి ఫలాలు మిక్స్ చేసి కొత్త రుచితో సమృద్ధి గల పోషకాహారాలను తయారు చేసింది. తల్లిపాలు ఎంత శ్రేష్టమైనవో.. అంత శ్రేష్టమైన మోనోలారిన్ కాంపోనెంట్ ఉన్న లేత కొబ్బరిని అందించడమే తమ వ్యాపారానికి కలిసొచ్చిందని నీలిమ నమస్తే తెలంగాణతో పంచుకున్నారు. ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీలో న్యూట్రిషన్ కోర్సును పూర్తి చేసిన నీలిమ 20 మందికి ఉపాధిని ఇస్తుంది. నగరంలో 13 లొకేషన్స్లో ఔట్లెట్లు ఉన్నాయి. ప్రగతినగర్లో కార్యాలయం ఉంది. ఈమె స్టార్టప్ ఐడియా.. ఎమరల్ జనరల్ యూకేలో ప్రచురితమయింది. పీఎం ఆఫీస్ నుంచి ప్రశంసలు వచ్చాయి. సస్టెనెబుల్ ప్రాజెక్టు కింద ఈ ప్రాజెక్టు ఎంపిక కావడం విశేషం.
వ్యవసాయంపై ప్రేమతో… విదేశం నుంచి రాక
చాలా మంది అగ్రికల్చర్ను చిన్నచూపు చూస్తారు. కానీ ఉన్నత చదువులు చదివి.. విదేశాల్లో స్థిరపడిన హైదరాబాదీ కీర్తి చెకోటి వ్యవసాయమే గొప్ప బిజినెస్ అని గ్రహించి తిరిగి నగరానికి వచ్చింది. నైజీరియాలో ఉద్యోగం చేస్తున్నప్పుడే ఆమె జనగాంలో కొంత ఫామింగ్ ఏరియాను కోనుగోలు చేసింది. ఇక్కడికి వచ్చాక రసాయానాలు వినియోగించకుండా కూరగాయలు, పండ్లు పండించింది. అయితే వాటి కొనుగోళ్లు ఆమెకు తృప్తినివ్వలేదు. మధ్యవర్తులను నమ్ముకని కష్టాలను చవి చూడాల్సి వచ్చింది. నేరుగా ప్రాడక్ట్స్ కస్టమర్ను చేరేందుకు చెక్ ఆర్గానిక్స్ బ్రాండ్ను ప్రారంభించింది. పంట పండించే సమయంలో వచ్చే కలుపు మొక్కల్లో ఔషధ మొక్కలను గుర్తించి వాటితో విభిన్న రకాల మెడిసిన్ ప్రాడక్ట్స్ తయారు చేశారు. అంతేకాదు చాలా అరుదుగా ఉండే నోని ఫ్రూట్ను కూడా ఆమె పండించి, విభిన్న రకాల జ్యూస్ను తయారు చేశారు. పసుపు నుంచి సబ్బులు, నూనెలు, నలుగుపిండి, షాంపులు తదితర బై ప్రాడక్ట్స్ను తయారు చేసింది. వీటికి మంచి స్పందన రావడంతో, మరో 40 మందికి ఉపాధిని ఇస్తుంది. న్యూట్రిషనల్ సైన్స్ ఆఫ్ ఇండియా అవార్డును అందుకుంది. యూనిక్ బెస్ట్ మ్యానుఫాక్చరింగ్ అవార్డునూ దక్కించుకున్నారు.