సిటీబ్యూరో, మార్చి 6(నమస్తే తెలంగాణ): ఓ ఘరానా దొంగను పట్టుకునేందుకు రాచకొండ పోలీసులు ఏకంగా 5 వేల సీసీ కెమెరాలను పరిశీలించారు. దర్యాప్తులో ఎక్కడ కూడా తగ్గకుండా చేసిన ప్రయత్నం.. చివరకు 2019లో జైలు నుంచి విడుదలై దాదాపు 100 చోరీలకు పాల్పడి తప్పించుకు తిరుగుతున్న యామిన్ను చాకచక్యంగా పట్టుకోగలిగారు. అయితే ఈ నేరస్తుడిని పట్టుకునేందుకు పోలీసులు చేసిన దర్యాప్తు ఆసక్తికరంగా సాగింది. కొద్ది రోజుల కిందట అబ్దుల్లాపూర్మెట్ పీఎస్ పరిధిలో తాళం ఉన్న ఇండ్లలో జరిగిన దొంగతనాలపై ఫిర్యాదులు వచ్చాయి. రంగంలోకి దిగిన సీసీఎస్ పోలీసులు.. సీసీ కెమెరాలను పరిశీలించారు. అప్పుడు వారికి ఓ వైట్కలర్ యాక్టివా బైక్ పై అనుమానం కలిగింది.
ఆ బండిని సీసీ కెమెరాల ద్వారా ఫాలో చేస్తూ.. మొత్తం 5 వేల కెమెరాలను జల్లెడ పట్టాల్సి వచ్చింది. అలా అబ్దుల్లాపూర్మెట్ నుంచి కర్నూలు వరకు ఫాలో అయ్యారు. ఈ సందర్భంలో దొరికిన పలు కెమెరాల్లో కొన్ని దృశ్యాలను మెరుగుపర్చుకుంటూ.. అనుమానితుడిపై ఓ స్పష్టత తెచ్చుకున్నారు. నిందితుడి ఇంటిని షాద్నగర్లో గుర్తించారు. ఆ గృహం యజమాని ద్వారా వివరాలను సేకరిస్తే..అప్పుడు షేక్ యామిన్ విషయం తెలిసింది. చివరకు అతడి వద్దకు చేరుకోగోలిగిన పోలీసులు.. అదుపులోకి తీసుకుని విచారించగా, తాను చేసిన 100 చోరీల చిట్టా బయటపడింది.