బంజారాహిల్స్,మార్చి 5: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఖైరతాబాద్ నియోజకవర్గంలో ‘మహిళా బంధు కేసీఆర్’ పేరుతో మహిళా దినోత్సవాన్ని మూడురోజుల పాటు సంబురంగా నిర్వహించనున్నామని ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. శనివారం జూబ్లీహిల్స్లోని తన నివాసం వద్ద మహిళా దినోత్సవాలకు సంబంధించిన బ్రోచర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. దేశంలోనే ఎక్కడా లేని విధంగా మహిళల కోసం రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు చెప్పేలా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్స్ తదితర పథకాలు దేశంలో ఏక్కడా లేవని గుర్తుచేశారు. మహిళల కష్టాన్ని గుర్తించడంతో పాటు వారిని గౌరవించుకోవడం ఎంతో అవసరమనే ఉద్దేశంతో నేటి నుంచి మంగళవారం వరకు నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు చేపట్టనున్నామన్నారు. 6, 7 తేదీల్లో నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ప్లాజా వద్ద జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులు, ఆశవర్కర్లు, వైద్యసిబ్బంది, అంగన్వాడీ సిబ్బందికి సన్మాన కార్యక్రమాలు ఉంటాయన్నారు. దీంతో పాటు 8న అన్ని డివిజన్లలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రసన్న, సోమాజిగూడ కార్పొరేటర్ వనం సంగీత యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
కన్నుల పండువగా వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు
జూబ్లీహిల్స్ టీటీడీ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో కన్నుల పండువగా జరిగాయి. ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. స్వామివారి పల్లకీ సేవలో ఎమ్మెల్యేతో పాటు టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
-బంజారాహిల్స్,మార్చి 5