బంజారాహిల్స్,మార్చి 5: ప్రభుత్వస్థలాల్లో నిర్మించుకున్న ఇండ్ల క్రమబద్ధీకరణ కోసం పెట్టుకున్న దరఖాస్తుల పరిశీలన కార్యక్రమం సోమవారం నుంచి ప్రారంభం కానుంది. షేక్పేట మండల పరిధిలో శనివారం నాటికి సుమారు 550 క్రమబద్ధీకరణ దరఖాస్తులను మీ సేవ కేంద్రాల ద్వారా చేసుకున్నారు. క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. షేక్పేట మండల పరిధిలో పెట్టుకున్న దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలన చేసేందుకు రెవెన్యూశాఖకు చెందిన సర్వేయర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సభ్యులుగా రెండు బృందాలను ఏర్పాటు చేశారు.
దరఖాస్తులను పరిశీలించడం కోసం ఇంటివద్దకు వచ్చే అధికారులకు సహకరించాలని తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డి కోరారు. ఇంటివద్ద దరఖాస్తుదారులు అందుబాటులో ఉండాలని సూచించారు. 2014 జూన్ 2 కంటే ముందునుంచి నిర్మాణం ఉన్నట్లు సూచించే పత్రాలను పరిశీలిస్తారన్నారు. పాత ఎలక్ట్రిసిటీ బిల్లు, నల్లా బిల్లు, జీహెచ్ఎంసీ ఆస్తిపన్ను రశీదు, గ్యాస్ కనెక్షన్ రశీదు, ఆధార్ కార్డు లాంటి పత్రాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అభ్యంతరాలు లేని స్థలాల్లో మాత్రమే క్రమబద్ధీకరణ సాధ్యమతుందని, క్షేత్రస్థాయి పరిశీలనలో పక్కవాళ్ల స్థలాన్ని తమదిగా చూపిస్తే ఇబ్బందులు తప్పవని పేర్కొన్నారు. పరిశీలన బృందం నివేదిక అనంతరం క్రమబద్ధీకరణ కమిటీ దరఖాస్తులను పరిశీలిస్తుందని, ఆర్డీవోతో పాటు తాను కమిటీలో ఉంటామని, తమ నివేదిక ఆధారంగా కలెక్టర్, సీసీఎల్ఏ అధికారులు అనుమతులు ఇస్తారని వివరించారు.