ఖైరతాబాద్, మార్చి 5: దివ్యాంగుల సంక్షేమంపై కేంద్రానికి చిత్తశుద్ధి లేదని దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పీఆర్డీ ఇండియా) రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు దైనంపల్లి మల్లికార్జున్ విమర్శించారు. దివ్యాంగుల చట్టం 2016 ప్రకారం, నాలుగు శాతం ఉద్యోగ రిజర్వేషన్లు పకడ్బందీగా అమలు చేయాలని, రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 28న నిర్వహించనున్న ‘చలో ఢిల్లీ’ వాల్ పోస్టర్ను ఎన్పీఆర్డీ ఇండియా వ్యవస్థాపకుడు రాజేందర్ తుడుం, జాతీయ అధ్యక్షుడు మహ్మద్ మున్నా, ఉపాధ్యక్షుడు చిక్క హరీశ్ కుమార్తో కలిసి శనివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఆవిష్కరించారు. మల్లికార్జున్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇందిరమ్మ జాతీయ పథకం ద్వారా దివ్యాంగుల పింఛను రూ.300 మాత్రమే చెల్లిస్తుందన్నారు.
సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకొని దివ్యాంగులకు నెలకు రూ.3,116 పింఛన్లు ఇస్తుంటే, కేంద్రం ఆ పథకంలో భాగంగా ఇచ్చే నామ మాత్రపు పింఛన్కు సైతం అనేక కొర్రీలు పెడుతున్నదన్నారు. ప్రభుత్వం 40 శాతం ఉన్న వారికి సైతం పింఛన్లు ఇస్తుంటే, కేంద్ర సర్కారు 80 శాతం అనే మెలికపెట్టి రాష్ట్రంలోని 5.60 లక్షల మందికి కేవలం 46 వేల మందికే ఇస్తూ, మిగతా వారికి మొండిచేయిచూపిందన్నారు. ఇందిరమ్మ జాతీయ పథకం ద్వా రా దివ్యాంగులకు రూ.300 నుంచి రూ.3వేలకు పింఛన్లు పెంచాలని, 4శాతం ఉద్యోగాల్లో, రాజకీయ రిజర్వేషనన్లు కల్పించాలన్నారు.
28న చలో ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా జాతీయ సదస్సును నిర్వహిస్తామని, అందులో అన్ని రాష్ర్టాలకు చెందిన పార్లమెంటరీ పక్ష నేతలు హాజరవుతారని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ నయీం, ఉపాధ్యక్షులు మోనార్ దుర్గా ప్రసాద్, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు గుండు రవి, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు జుబేదా బేగం, నాయకులు అస్మ ఖాతూన్, వడగం ఆంజనేయులు, శ్రీనివాస్, దామెర రమేశ్, కొడం శ్రీనివాస్, రాజేందర్, ఉపేందర్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.