“దళితుల్లో ఆత్మగౌరవాన్ని పెంచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ మదిలో మెదిలిన అద్భుతమైన పథకం దళిత బంధు. ఆయన అభినవ అంబేద్కర్లా ప్రజాసంక్షేమానికి అహర్నిశలు శ్రమిస్తున్నారు. ‘దళితబంధు’తో దళితుల స్వయం ఉపాధికి బాటలు వేస్తూ.. వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తున్నారు”. అని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. నియోజకవర్గంలో దళితబంధు పథకం అమలుకు తీసుకుంటున్న చర్యలు, లబ్ధిదారుల ఎంపిక, పథకంపై అవగాహన కల్పిస్తున్న తీరు తదితర అంశాలపై ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని చెప్పిన ఆయన.. ‘దళితబంధు’ దళిత కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నదని, వారి ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తున్నదని చెప్పారు. – సికింద్రాబాద్, మార్చి 4
కసరత్తు పూర్తయింది..
నియోజకవర్గంలో తొలివిడతగా 100 దళిత కుటుంబాలకు ‘దళితబంధు’ అమలు చేయనున్నాం. ఇందుకు సంబంధించి అర్హులైన 100 కుటుంబాలను ఎంపిక చేసే ప్రక్రియను దాదాపు పూర్తి చేశాం. అధికారులు ఇప్పటికే దళిత కుటుంబాల ఎంపికపై కసరత్తు పూర్తి చేశారు.
నచ్చిన వ్యాపారం..
దళితులు తమకు నచ్చిన వ్యాపారం చేసుకునే పూర్తి స్వేచ్ఛ ఈ పథకంలో ఉంది. లబ్ధిదారులు ఎక్కడైనా వ్యాపారాన్ని నిర్వహించుకునే వెసలుబాటు ప్రభుత్వం కల్పించింది.
సీఎం కేసీఆర్ను దేవుడిలా కొలుస్తున్నారు..
ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా లబ్ధి దారుల ఎంపిక ప్రక్రియ కొనసాగించాం. తెలంగాణ కోసం ఉద్యమించిన దళిత ఉద్యమకారులు, నిరుపేద దళితులకు ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించాం. దళితబంధు పథకం అమలుతో దళితులు ముఖ్యమంత్రి కేసీఆర్ను దేవుడిలా కొలుస్తున్నారు.
అన్ని వర్గాలూ స్వాగతిస్తున్నాయ్..
స్వతంత్ర భారతదేశంలో నేటికీ తిండికి తిప్పలు పడే దళిత కుటుంబాలు ఉండటం దురదృష్టం. గతంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలిస్తే అవి ఎటూ సరిపోయేవి కావు. వారి బతుకులను రోడ్డున పడేసే పథకాలుగా ఉండేవి. పది లక్షల రూపాయలను నేరుగా లబ్ధిదారుడికి అందించి జీవనోపాధి చూపిస్తున్న దళిత బంధు పథకాన్ని రూపకల్పన చేయడం గొప్ప విషయం. అన్ని వర్గాల ప్రజలు ఈ పథకం అమలును స్వాగతిస్తున్నారు.
దేశానికే ఆదర్శంగా నిలిచే కార్యక్రమం
దళితబంధు పథకం ఒక ఇన్నోవేటివ్ ప్రోగ్రాం. ఇది దేశానికే ఆదర్శంగా నిలిచే కార్యక్రమం. వందశాతం రాయితీతో రూ.10లక్షలు మంజూరు చేయాలనే ఆలోచన రావడమే గొప్ప విషయం. సమాజంలో వివక్షతకు గురవుతున్న వారిని ఆర్థికంగా ఉన్నతికి తీసుకురావాలనే ఆలోచనతో దళితబంధు పథకాన్ని సీఎం కేసీఆర్ తీసుకొచ్చారు.
దళితుల అభ్యున్నతికి దోహదం
దేశంలో ఏ రాష్ట్రమూ అమలు చేయని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో దళితబంధు అమలు చేస్తున్నారు. వ్యాపారం నిర్వహించే సామర్థ్యం, శ్రమించే శక్తి ఉన్నా.. పెట్టుబడి లేక ఎంతో మంది దళితులు ప్రగతి సాధించలేకపోయారు. ఈ పథకం అమలుతో వ్యాపారం చేయాలి… ఆర్థికంగా నిలదొక్కుకోవాలనుకునే వారి ఆకాంక్ష నెరవేరుతుంది. దళితుల అభ్యున్నతికి ఈ పథకం ఎంతో దోహదం చేస్తుంది.
అవగాహన కల్పిస్తున్నాం..
ఇప్పటికే అధికారులు ఈ పథకంపై దళితులకు అవగాహన కల్పిస్తున్నారు. యూనిట్ల ఎంపిక, ఉపాధి మార్గాలపై వారికి వివరిస్తున్నారు. ఎంపిక చేసిన ప్రతి దళిత కుటుంబం రూ.10 లక్షలతో వ్యాపారం చేసుకునే అవకాశం ఉంది.