సిటీబ్యూరో/ సికింద్రాబాద్ , మార్చి 4 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీ పరిధిలో ఎస్ఆర్డీపీ కింద రూ.6 వేల కోట్ల విలువ చేసే పనులను ఇప్పటికే పూర్తి చేశామని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలోని తుకారం గేట్ వద్ద రూ.72 కోట్లతో ఏర్పాటుచేసిన రోడ్డు అండర్ బ్రిడ్జి(ఆర్యూబీ)ని శుక్రవారం డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతశోభన్రెడ్డిలతో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.
హైదరాబాద్ను విశ్వనగరంగా మార్చేందుకు
విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న నగరాభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. నగరంలో ఆర్యూబీలు, ఆర్వోబీల నిర్మాణంపై ఇటీవల రైల్వే శాఖతో సమావేశం అయ్యామని చెప్పారు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న సమస్యలకు పరిష్కారం దొరికేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నగరంతో పాటు చుట్టుపక్కల అవసరమైన చోట ఆర్యూబీలు, ఆర్వోబీలు నిర్మిస్తామని పేర్కొన్నారు.
ఆర్యూబీ ఏర్పాటుతో అపారమైన లాభం
అడ్డగుట్ట, లాలాపేట డివిజన్ల ప్రజలకు ఈ ఆర్యూబీ ద్వారా అపారమైన లాభం చేకూరుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. 2003లో తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రస్తుత సీఎం కేసీఆర్తో పాటు పద్మారావుగౌడ్ ఈ దారిలో లాలాపేట వెళ్లాలంటే రైల్వే క్రాసింగ్ గేట్ కారణంగా ఎన్ని ఇబ్బందులు పడ్డారో కళ్లకు కట్టినట్లు చెప్పారని అన్నారు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న సమస్యకు పరిష్కారం దొరికిందన్నారు. రూ.72 కోట్లతో రోడ్డు అండర్ బ్రిడ్జిని నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ నేతృత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. రోడ్ల విస్తరణ, ఆర్యూబీల నిర్మాణంతో పాటు కొత్తగా కాలేజీలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో సైతం పద్మారావు గౌడ్ నాయకత్వంలో సికింద్రాబాద్ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందనే సంపూర్ణ విశ్వాసం తనకు ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.
చిరకాల స్వప్నం నెరవేరింది
– డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్
దశాబ్దాల చిరకాల స్వప్నంగా ఉన్న ఈ వంతెన పూర్తికావడం ఎంతో సంతోషంగా ఉందని డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ అన్నారు. అడ్డగుట్ట నుంచి మల్కాజిగిరి వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న రోజులు ఉన్నాయని గుర్తు చేసుకున్నారు. రూ.72కోట్ల వ్యయంతో ఆర్యూబీ నిర్మించగా, ప్రాజెక్ట్కు రూ.33కోట్లు, వంతెన నిర్మాణంతో నష్టపోయిన బాధితులకు రూ.39కోట్ల మేర పరిహారం ఇచ్చినట్లు తెలిపారు. ఆర్యూబీ ప్రారంభం కావడంతో కంటోన్మెంట్, మల్కాజిగిరి ప్రాంతాలకు సాఫీగా ప్రయాణం చేయవచ్చని చెప్పారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయని తెలిపారు. నియోజకవర్గం పరిధిలోని ఐదు డివిజన్లలో ఏ చిన్న సమస్య తలెత్తినా ముందుండి పరిష్కరిస్తున్నామని, రానున్న రోజుల్లో డివిజన్ల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.
ఈ అండర్ బ్రిడ్జితో మల్కాజిగిరి, మారేడ్పల్లి, మెట్టుగూడ, లాలాపేట తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని, అంతేకాకుండా మౌలాలీ, మల్కాజిగిరి, తార్నాక, సికింద్రాబాద్ వైపు వెళ్లేందుకు రోడ్డు కనెక్టివిటీ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, జోనల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, జాయింట్ కమిషనర్ పల్లె మోహన్రెడ్డి, డీసీ దశరథ్తో పాటు కార్పొరేటర్లు సామల హేమ, కంది శైలజ, రాసూరి సునిత, ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్, టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్రెడ్డి, నేతలు కిశోర్కుమార్, కిరణ్కుమార్ గౌడ్, రామేశ్వర్గౌడ్, జలంధర్రెడ్డి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.