అమీర్పేట్, మార్చి 4: దాసారం హట్స్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరలో పరిష్కరిస్తానని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్థానికుల్లో భరోసా కల్పించారు. అయితే, బస్తీవాసులు శుభ్రతకు పెద్దపీట వేయాలని సూచించారు. ఇంటింటి చెత్త సేకరణ పనులు చేపడుతున్న కారణంగా ఇక్కడ పోగవుతున్న చెత్త విస్తరించకుండా చుట్టుపక్కల కాలనీ నివాసితులకు ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాలని దాసారం హట్స్ నివాసితులను కోరారు.
సనత్నగర్ బస్స్టాండ్ సమీపంలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నెలకొల్పిన జిమ్లో రూ.17.40 లక్షలతో ఏర్పాటు చేసిన నూతన పరికరాలను మంత్రి తలసాని, సనత్నగర్ కార్పొరేటర్లతో కలిసి నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం రవీంద్రనగర్లో రూ.32 లక్షలతో చేపడుతున్న సీవరేజీ, వాటర్ పైపులైను పనులను ప్రారంభించిన అనంతరం రూ.7.70 లక్షలతో చేపడుతున్న పార్కు చైన్ లింక్ ఫెన్సింగ్ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం దాసారం హట్స్ నివాసితులతో వారు మాట్లాడారు.
ఈ సందర్భంగా దాసారం హట్స్ మహిళలు తమకు తాగునీటి నల్లాలు కావాలంటూ చేసిన విజ్ఞప్తికి మంత్రి తక్షణమే స్పందించారు. వెంటనే అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. త్వరలోనే అన్ని విభాగాల అధికారులతో కలిసి వచ్చి దాసారం హట్స్ నివాసితులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తానని తెలిపారు. మంత్రి పర్యటనలో జో నల్ కమిషనర్ రవికిరణ్, డిప్యూటీ కమిషనర్ వంశీకృష్ణ, జలమండలి జీఎం హరిశంకర్లతో పాటు టీఆర్ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఇన్స్పెక్టర్ సైదులుకు అభినందనలు
అసాంఘిక కార్యకలాపాలకు ఆకర్షితులు కాకుండా ఇక్కడి హట్స్కు చెందిన పిల్లలకు సాయంత్రం వేళల్లో ఉచితంగా ట్యూషన్లు చెప్పేలా కొన్ని ఎన్జీవోలతో కలిసి ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్ సైదులు చేస్తున్న కృషిని హట్స్ మహిళలు కొందరు మంత్రి తలసాని, నగర మేయర్కు వివరించారు. తమ పిల్లలు సాయంత్రం వేళల్లో ట్యూషన్లలో గడుపుతుండటం తమకు ఆనందంగా ఉందని చెప్పగా, ఇందుకు మంత్రి స్పందిస్తూ పోలీసులంటే కేవలం నేరాల నియంత్రణకే కాదు, సమాజంలో చక్కటి మార్పును తీసుకురావాలన్న సంకల్పం గొప్పదని, ఆ దిశగా కృషి చేస్తున్న ఇన్స్పెక్టర్ సైదులును అభినందించారు.