అడ్డగుట్ట, మార్చి 4 : దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న తుకారాంగేట్ రోడ్ అండర్ బ్రిడ్జి(ఆర్యూబీ)కి మోక్షం లభించింది. టీఆర్ఎస్ ప్రభుత్వహయాంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ప్రత్యేక చొరవతో తుకారాంగేట్వాసుల చిరకాల స్వప్నం ఫలించింది. రూ.72 కోట్ల భారీ వ్యయంతో నిర్మించిన ఆర్యూబీని శుక్రవారం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఉపసభాపతి పద్మారావుగౌడ్, మంత్రులు మహమూద్ ఆలీ, తలసాని శ్రీనివాస్యాదవ్, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్, సికింద్రాబాద్ కార్పొరేటర్లు, జీహెచ్ఎమ్సీ ఉన్నతాధికారులతో కలిసి ప్రారంభించారు. దీంతో స్థానికులు, వాహనదారులు టీఆర్ఎస్ ప్రభుత్వం, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ పనితీరుపై హర్షం వ్యక్తం చేశారు.
50 ఏండ్ల నాటి సమస్య పరిష్కారం
తుకారాం రైల్వేగేటు 50 ఏండ్ల నాటి సమస్య పరిష్కారం అయ్యింది. గత ప్రభుత్వాల హయాంలో కాగితాలకే పరిమితమైంది. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ ప్రత్యేక చొరవ తీసుకొని రైల్వే అధికారులను ఒప్పించి పనులు ప్రారంభమయ్యేలా చేశాడు. పద్మారావుగౌడ్ కృషి మరువలేనిది.
– అంజయ్య, తుకారాంగేట్
ప్రయాణ దూరం తగ్గింది
గతంలో తరుచూ రైల్వే గేటు పడుతుండడంతో మల్కాజ్గిరి, మౌలాలి, ఇసీఐఎల్కు వెళ్లాల్సి వస్తే చుట్టూ తిరిగి వెళ్లేది. కానీ ప్రస్తుతం ఆర్యూబీ అందుబాటులోకి రావడంతో చాలా ప్రాంతాలకు ఇది షార్ట్కట్ అవుతుంది. తద్వారా ప్రయాణభారం తగ్గింది. వాహనదారులకు ఎంతో మేలు జరుగుతున్నది.
– సత్యనారాయణ, వాహనదారుడు
చిరకాల స్వప్నం సాకరమైంది
రోడ్ అండర్ బ్రిడ్జి తుకారాంగేట్ ప్రజల చిరకాల స్వప్నం సాకారం చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్కు దక్కుతుంది. ఆర్యూబీ పనుల ప్రారంభం నుంచి పూర్త య్యే వరకు పద్మారావుగౌడ్ చేసిన కృషి అసాధారణమైనది. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న సమస్యకు మోక్షం కలుగడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
– లింగాని ప్రసన్న శ్రీనివాస్, కార్పొరేటర్