సిటీబ్యూరో, మార్చి 3(నమస్తే తెలంగాణ)/సికింద్రాబాద్/మారేడ్పల్లి: రాష్ట్రంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లు దేశంలో ఏ ప్రభుత్వమూ ఇప్పటివరకు నిర్మించలేదని, డిగ్నిటీ కాలనీలతో నిరుపేదల కుటుంబాలు కూడా ఆత్మగౌరవంతో జీవిస్తున్నాయని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సీఎం కేసీఆర్ పెద్ద మనస్సుతో పేదల సొంతింటి కల నెరవేర్చాలని కోట్లాది రూపాయలు వెచ్చించి అన్ని వసతులతో లబ్ధిదారులపై పైసా భారం పడకుండా ఇండ్లు కట్టించి ఇస్తున్నారని చెప్పారు.
ఓల్డ్మారేడుపల్లిలో 5.18 ఎకరాల విస్తీర్ణంలో రూ.36.27 కోట్ల వ్యయంతో 22 బ్లాక్లలో అధునాతనంగా నిర్మించిన 468 డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయాన్ని గురువారం మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు హక్కు పత్రాలు అందజేశారు. మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తూ..రాష్ట్రంలో 18 వేల కోట్ల వ్యయంతో 2.72 లక్షల గృహాలు అర్హులైన పేదలకు పంపిణీ చేస్తామని, ఇందులో గ్రేటర్ పరిధిలో లక్ష ఇండ్లు అద్భుతంగా నిర్మిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను చూసి ఇతర రాష్ట్రాల ప్రజలు ఇలాంటి ముఖ్యమంత్రి మాకుంటే బాగుండు అంటున్నారని గుర్తుచేశారు. ఇల్లు కట్టిస్తా..బిడ్డ పెండ్లి కూడా నేనే చేస్తా..అన్న ముఖ్యమంత్రి దేశంలో కేసీఆర్ ఒక్కరేనని స్పష్టం చేశారు.
అరకోటి విలువచేసే ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలని, కిరికిరిలు పెట్టుకొని ఆగం చేయవద్దన్నారు. ఇచ్చిన ఇండ్లను అమ్మడం లేదా కొనడం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, కార్మిక, హోంశాఖ మంత్రులు మల్లారెడ్డి, మహమూద్ అలీ, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, కార్పొరేషన్ల చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, గజ్జెల నాగేశ్, బల్దియా కమిషనర్ లోకేశ్కుమార్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్, కార్పొరేటర్ కె.దీపికానరేష్, హౌ సింగ్ సీఈ సురేష్, కిషన్, ఎస్ఈ విద్యాసాగర్, ఆర్డీవో వసంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
గేటెడ్ కమ్యూనిటీలకు తీసిపోనట్లు..
కంటోన్మెంట్ నియోజకవర్గం పాత మారేడ్పల్లిలో నిర్మించిన రెండుపడక గదుల ఇండ్లు గేటెడ్ కమ్యూనిటీలను తీసిపోని విధంగా నిర్మించారు. చక్కటి గార్డెనింగ్, పార్కు, పార్కింగ్ వసతి, వచ్చిపోయే మార్గం..ప్రతీది ప్రత్యేకంగా నిర్మించడంతో కొత్తగా వచ్చిన వారు..పేదల కోసం ప్రభుత్వం
నిర్మించిన కాలనీయేనా..అని ఆశ్చర్యపోక తప్పదు.
ఇలాంటి ఇండ్లు మరెకడా లేవు: మంత్రి తలసాని
రూ.350 కోట్ల విలువైన స్థలంలో నిర్మించిన ఒక్కో డబుల్బెడ్ రూం ఇల్లు రూ.కోటికి తకువగా ఉండదని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. ఈ కాలనీవాసులకు నల్లాబిల్లు ఉండదని, కంటోన్మెంట్ కేంద్ర పరిధిలో ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇకడ నివసించే వారికి అవసరమైన పనులు చేస్తున్నారని, కంటోన్మెంట్లో కూడా ఇంటింటికి 20 వేల లీటర్ల తాగునీటిని ఉచితంగా అందిస్తున్నదని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లబ్ధిదారులపై ఒక రూపాయి భారం పడకుండా చక్కటి ఇండ్లు నిర్మించి ఇస్తున్నారని, దేశంలో మరెక్కడా ఇలాంటి ఇండ్లు లేవన్నారు. వరద నివారణ కోసం రూ.10 కోట్లతో హస్మత్పేట నాలాను పునరుద్ధరిస్తున్నట్లు చెప్పారు.
అర్హులందరికీ ఇండ్లు: ఎమ్మెల్యే సాయన్న
గతంలో ఇకడ నివాసమున్న వారందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు వస్తాయని, ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పన్లేదని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. కొంచెం ఆలస్యం అయ్యింది..నయాపైసా ఖర్చు లేకుండా అన్ని వసతులతో ఉచితంగా ఇల్లు కట్టిస్తున్నామని చెప్పారు. ఉచితంగా తాగునీరు వస్తుందని, రూపాయి కూడా బిల్లు కట్టాల్సిన పనిలేదన్నారు.
సల్లగుండయ్యా..
‘30 ఏండ్లుగా ఈ బస్తీలోనే బతుకుతూ వస్తున్నాం. ఇప్పుడు కొత్త ఇంట్లోకి మీతోటి అడుగుపెట్టగానే ఎంతో ఆనందంగా ఉందయ్యా. మాలాంటి పేదలకు ఇంత మంచి ఇండ్లు కట్టిస్తున్న మీరు నిండు నూరేళ్లు సల్లగుండాలయ్యా’ అని మంత్రి కేటీఆర్ను ఆశీర్వదించారు పలువురు లబ్ధిదారులు. కేటీఆర్ సైతం వారందరినీ ఎంతో అప్యాయంగా పలుకరిస్తుస్తూ, యోగక్షేమాలను అడిగి తెలుసుంటుంటే లబ్ధిదారుల ఆనందానికి ఆవధుల్లేకుండా పోయాయి. అనంతరం పట్టాలు అందించే సందర్భంలోనూ ఓ పెద్దావిడ మంత్రి కేటీఆర్ తలపై చేయి వేసి ‘మీ రుణం తీర్చుకోలేనిదని, మీరంతా సంతోషంగా ఉండాలి’ అంటూ ఆశీర్వదించింది. మీ అభిమానం చూస్తుంటే కడుపు నిండిందని మంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారువ్యాఖ్యానించారు.
కడుపు నిండింది..
డబుల్ బెడ్ర్రూం ఇండ్ల లబ్ధిదారుల ఆనందం చూస్తుంటే…కడుపు నిండినంతా పనైనందని మంత్రి కేటీఆర్ అన్నారు. లబ్ధిదారులను సీఎం కేసీఆర్ కోటీశ్వర్లను చేశారని, ఇండ్లు బ్రహ్మాండంగా ఉన్నాయని లబ్ధిదారులు సంబురంగా చెప్తుంటే సంతోషంగా ఉందన్నారు. ఇంతకుమించిన తృప్తి రాజకీయాల్లో దేనితోను రాదన్నారు. దళారులు కొందరు ఇండ్లు ఇప్పిస్తామని మాయమాటలు చెబుతున్నారని.. అలాంటి వారి మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. ఇండ్ల విషయంలో ఎలాంటి పైరవీలు ఉండవని, లాటరీ పద్ధతిన బస్తీవాసులకు కేటాయిస్తామని స్పష్టం చేశారు.
50 ఏండ్ల కల నెరవేరింది
పాత మారేడ్పల్లిలో మేము 50 ఏండ్లుగా అనేక కష్టాలు పడ్డాం. ఇన్నాండ్లకు మా కల నెరవేరింది. మాలాంటి గరీబోళ్ల జీవితాల్లో వెలుగులు వచ్చాయి. గుడిసెలోనే జీవితం వెళ్లదీశాం. సీఎం కేసీఆర్, మంత్రి శ్రీనివాస్యాదవ్, ఎమ్మెల్యే సాయన్నల సంకల్పంతో సౌకర్యవంతంగా ఉండేందుకు చక్కటి గృహం లభించింది.
– బి.పద్మావతి, లబ్ధిదారురాలు
సర్కారుకు రుణపడి ఉంటాం
పేదల కష్టాలను తొలగించే ప్రభుత్వాలకు ప్రజల మద్దతు ఉంటుంది. దేశ చరిత్రలో పేదలకు రెండుపడక గదుల ఇల్లు ఉండాలని ఎవరూ ఆలోచన చేయలేదు. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని మాకు ఇండ్లు కట్టించి ఇస్తున్నారు. మేము పడ్డ బాధలు మా తర్వాతి తరం వాళ్లు పడకూడదు. సకల సదుపాయాలతో నిర్మించిన ఇండ్లు ఇచ్చారు.
– జీ.జీ.కరుణ, లబ్ధిదారురాలు
సీఎం సార్ మేలు మరువలేం..
పేదల కష్టాలను తీర్చే సీఎం కేసీఆర్ సార్కు రుణపడి ఉంటాము. ఈ ప్రాంతంలో ఇంతమంచి ఇండ్లు నిర్మించి ఇస్తారని జీవితంలో అనుకోలేదు. చిన్నచిన్న గదుల్లో కూలీ పని చేసుకుంటూ బతికేటోళ్లం. ఎమ్మెల్యే సాయన్న, మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్యాదవ్ చొరవతో ఇంత మంచి ఇళ్లు కట్టించి ఇచ్చారు.
– ధనలక్ష్మి, ఓల్డ్మారేడ్పల్లి
అసలు ఊహించలేదు..
మా బస్తీలో ఇంతమంచి విశాలమైన ఇండ్లు నిర్మించి ఇస్తరని అసలు ఊహించలేదు. గత ప్రభుత్వాలు,పాలకులు మా బస్తీలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేదు. బస్తీలో ఎవరైనా చచ్చిపోతే మృతదేహాన్ని చిన్న చిన్న గల్లీల్లోంచి తీసుకపోవడానికి చాలా ఇబ్బందులు పడ్డాం. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంతమంచి ఇండ్లు కట్టించడం సంతోషంగా ఉంది.
– అనురాధ, ఓల్డ్మారేడ్పల్లి
బస్తీ రూపురేఖలు మారాయి
గతంలో మా బస్తీ ఇరుకుగా, చిన్నచిన్న గల్లీలోంచి రాకపోకలు సాగించేటోళ్లం. డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించిన తర్వాత రూపురేఖలు మారిపోయాయి. మాలాంటి పేదల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రికి ఎల్లప్పుడు మా మద్దతు ఉంటుంది.
– రేణుక,ఓల్డ్మారేడ్పల్లి