సిటీబ్యూరో, మార్చి 2 (నమస్తే తెలంగాణ): అత్యాధునిక, మెరుగైన పద్ధతిలో హైదరాబాద్ నగరాన్ని స్వచ్ఛంగా మారుస్తున్నట్లు రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి తారక రామారావు అన్నారు. బుధవారం నెక్లెస్ రోడ్డులో ఆధునిక సాంకేతిక పద్ధతిలో వ్యర్థాలను తరలించే 60 రకాల వాహనాలను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతాశోభన్ రెడ్డి, కమిషనర్ లోకేశ్ కుమార్, రాంకీ సీఈఓ గౌతమ్రెడ్డిలతో కలిసి ఆయన ప్రారంభించారు.
అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ స్వరాష్ట్రంలో జీహెచ్ఎంసీ, రాంకీల సంయుక్తాధ్వర్యంలో ఘనవ్యర్థాల శుద్ధిని సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. నేడు నిత్యం ఉత్పత్తి అవుతున్న 6500 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను 4500 స్వచ్ఛ ఆటోల ద్వారా సేకరిస్తున్నట్లు వివరించారు. నెల రోజుల్లో మరో 4500 స్వచ్ఛ ఆటోలను తీసుకురానున్నామని స్పష్టం చేశారు. 2015లో 2500, 2020లో 650, 2021లో 1350 ఆటోలు పంపిణీ చేశామని అన్నారు. కొత్తగా వస్తున్న 400 ఆటోలతో కలిపి నగరంలో 5000 స్వచ్ఛ ఆటోలతో ఇక ఇంటింటికీ తిరిగి సమర్థవంతంగా చెత్తను సేకరిస్తామన్నారు.
విశ్వనగరం స్థాయిలో..
హైదరాబాద్లో చెత్త సేకరణకు అభివృద్ధి చెందిన దేశాల్లో మాదిరి ఆధునిక వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు రిఫ్యూజ్ కంటైనర్, హుక్ మౌంటెడ్, సిలిండ్రికల్ కంటైనర్లను అందుబాటులోకి తెచ్చామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. నగరంలోని 17 ట్రాన్స్ఫర్ స్టేషన్లు ఉంటే అందులో 11 స్టేషన్లను ఆధునీకరించామని.. మరో నాలుగు స్టేషన్ల పనులు ప్రగతిలో ఉన్నాయని తెలిపారు. మిగిలిన రెండింటి పనులను త్వరలో చేపట్టి పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
దుర్గంధం లేకుండా చర్యలు..
జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన 17 ట్రాన్స్ఫర్ స్టేషన్ల చుట్టూ ఎలాంటి దుర్గంధం లేకుండా చూడాలని మంత్రి కేటీఆర్ అధికారులకు సూచించారు. 150 డివిజన్లలో 95 సెకండరీ కలెక్షన్ ట్రాన్స్ఫర్ పాయింట్స్ ఏర్పాటు చేస్తే ప్రాథమిక స్థాయిలో సేకరణ సులభం అవుతుందన్నారు. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న వాహనాలకు అదనంగా మరో 60 వాహనాలను అందుబాటులోకి తెచ్చినట్లు మంత్రి స్పష్టం చేశారు.
శుద్ధి ప్రక్రియలు అత్యంత సమర్థవంతంగా..
నగరంలో ఉత్పత్తవుతున్న వ్యర్థాలను అత్యాధునిక పద్ధతులను వినియోగించి తరలిస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. జవహర్నగర్ డంపింగ్ యార్డులో పేరుకుపోయిన వ్యర్థాలతో పరిసర గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడకుండా రూ.140 కోట్లతో క్యాపింగ్ చేశామని తెలిపారు. వర్షాలతో డంపింగ్యార్డు నుంచి వచ్చే బురద చెరువులను కలుషితం చేయకుండా ఉండేందుకు రూ.250 కోట్లతో శుభ్రం చేస్తున్నట్లు తెలిపారు. ఘన, ద్రవ వ్యర్థాల శుద్ధికి ప్రాధాన్యమిస్తూ రూ.3866 కోట్లతో సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా నగరంలోని చెరువుల్లోని గుర్రపు డెక్కను తొలగించేందుకు ఆరు ఫ్లోటింగ్ ట్రాష్ కలెక్టర్లను కొనుగోలు చేశామని తెలిపారు. వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు 24 మెగావాట్ల ప్లాంట్ను ప్రారంభించామని..
ఇది దక్షిణ భారత దేశంలోనే అతి పెద్దదన్నారు. మరో 24 మెగావాట్ల కేంద్రాన్ని రూ.550 కోట్లతో నిర్మాణం చేపట్టామని వివరించారు. మొత్తంగా ఘన, ద్రవ వ్యర్థాల శుద్ధిని దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అత్యాధునిక పద్ధతుల్లో నిర్వహిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేట్ పి.విజయారెడ్డి, హెల్త్ అండ్ శానిటరీ అడిషనల్ కమిషనర్ బి.సంతోష్, జాయింట్ కమిషనర్ సంధ్య, జోనల్ కమిషనర్లు శ్రీనివాస్ రెడ్డి, రవికిరణ్, హౌసింగ్ ఓఎస్డీ సురేష్ కుమార్, ఎస్డబ్ల్యూఎం ఎస్సీ కోటేశ్వరరావు, రాంకీ జేఎండీ మాసూద్ తదితరులు పాల్గొన్నారు.