మేడ్చల్ జోన్ బృందం, మార్చి 1 : మహా శివరాత్రి సందర్భంగా మేడ్చల్ నియోజకవర్గంలోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారు జామునుంచే శైవక్షేత్రాలు శివనామ స్మరణతో మారుమోగాయి. త్రినేత్రుడు మంగళవారం ఘనమైన పూజలందుకున్నాడు. స్వామి వారిని భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఉపవాస దీక్షలు చేపట్టి, రాత్రి జాగరణ కార్యక్రమాలు చేపట్టారు.
శివాలయాల్లో భక్తుల కోసం జానపద కథలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మేడ్చల్, ఘట్కేసర్, పోచారం, నాగారం, దమ్మాయిగూడ, మున్సిపాలిటీలు, జవహర్నగర్ కార్పొరేషన్, మేడ్చల్ మండలంలోని ఆలయాల్లో పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. దమ్మాయిగూడ మున్సిపల్ పరిధి…భవానీ నాగలింగేశ్వర స్వామి ఆలయం, శామీర్పేట మండలంలోని లక్ష్మాపూర్, కేశవరం గ్రామంలోని ఆలయాల్లో స్వామివారి కల్యాణోత్సవాలు ఘనంగా నిర్వహించారు.