ఘట్కేసర్, మార్చి 1 : వేసవిలో మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఘట్కేసర్ చైర్పర్సన్ ఎం.పావనీ జంగయ్య యాదవ్ తెలిపారు. మున్సిపాలిటీ పరిధి…10వ వార్డులోని సెంట్రల్ పార్కులో నీటి బోరు తవ్వకం పనులను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో హరితహరంలో భాగంగా, పార్కులు, ఖాళీ స్థలాల్లో వేల మొక్కలు నాటామని తెలిపారు.
నాటిన మొక్కలను వేసవిలో బతికించుకునేందుకు ప్రతిరోజు నీటిని అందించాలని నిర్ణయించామన్నారు. పార్కులు, వైకుంఠధామాలు, రోడ్ల వెంట నాటిన మొక్కలు పెరిగి నీడనిస్తున్నాయని చెప్పారు. భవిష్యత్తు తరాలకు మంచి వాతావరణం అందించేందుకు ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. కౌన్సిలర్ శశికళ, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి బి.రాధాక్రిష్ణ ముదిరాజ్, ఏఈ శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకుడు ఎం. జంగయ్య యాదవ్, ప్రజలు పాల్గొన్నారు.