మేడ్చల్ రూరల్, మార్చి 1 : గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కండ్లకోయలో ఎంఎస్ఆర్ యువసేన ఆధ్వర్యంలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని టీఆర్ఎస్ నేత, మాజీ సర్పంచ్ మద్దుల శ్రీనివాస్ రెడ్డి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. టోర్నీలో 15 టీంలు పాల్గొనగా, ఫైనల్కు జ్ఞానాపూర్, కండ్లకోయ కేఎన్ఆర్ జట్లు చేరుకున్నాయి. ఫైనల్లో జ్ఞానాపూర్ విజేతగా నిలువగా, రన్నర్గా కండ్లకోయ కేఎన్ఆర్ జట్టు నిలిచింది. అనంతరం విజేతలకు మద్దుల శ్రీనివాస్ రెడ్డి, నాయకులతో కలిసి నగదు బహుమతితో పాటు ట్రోఫీలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతకు క్రీడలపై ఆసక్తిని పెంపొందించాలనే సంకల్పంతో క్రీడా పోటీలను నిర్వహించామన్నారు. ఆసక్తి, నైపుణ్యం గల క్రీడాకారులకు సహాయ సహకారాలు అందజేస్తామని పేర్కొన్నారు. మున్సిపాలిటీ అధ్యక్షుడు సంజీవగౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ కందాడి నరేందర్ రెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.