
సిటీబ్యూరో, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): ఉప్పల్ భగాయత్ లే అవుట్లో ప్లాట్ల అమ్మకానికి సంబంధించి నిర్వహించిన ప్రీ బిడ్ సమావేశానికి విశేష స్పందన లభించింది. దశల వారీగా అభివృద్ధి చేసిన మూడు లేఅవుట్లలో మొత్తం 44 ప్లాట్లను ఆన్లైన్ వేలం ద్వారా విక్రయించనున్నారు. ఇందులో భాగంగా సోమవారం నాగోల్ బ్రిడ్జి వద్ద ఉప్పల్ భగాయత్ లేఅవుట్లో హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ఆధ్వర్యంలో ప్రీ బిడ్ సమావేశాన్ని నిర్వహించారు. స్థానిక భూ వ్యాపారులతో పాటు బిల్డర్లు, డెవలపర్లు, కంపెనీలు, ఏజెన్సీల ప్రతినిధులు ప్రీ బిడ్ సమావేశానికి హాజరై నియమ నిబంధనలను తెలుసుకున్నారు. వారికున్న సందేహాలను అధికారులను అడిగి నివృత్తి చేసుకున్నారు. హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బి.ఎల్.ఎన్.రెడ్డి, ఎస్టేట్ ఆఫీసర్ కె.గంగాధర్, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ సి.విజయలక్ష్మి, ఓఎస్డీ ఎం.రాంకిషన్, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గంగాధర్, భూసేకరణ అధికారిణి ప్రసూనాంబ, ఎంఎస్టీసీ అధికారులు ప్రీ బిడ్ మీటింగ్లో పాల్గొని కొనుగోలు దారుల సందేహాలను నివృత్తి చేశారు.
రాష్ట్రంతో పాటు..
ఉప్పల్ భగాయత్ లేఅవుట్కు ఉన్న ప్రత్యేకతలను, ఉజ్వల భవిష్యత్ను వివరించారు. ఆన్లైన్ వేలం పాటలో ప్లాట్లు కొనుగోలు చేసిన తర్వాత వాయిదాల చెల్లింపులు, రిజిస్ట్రేషన్ తదితర అంశాలపై అధికారులు స్పష్టతనిచ్చారు. బ్యాంకు చార్జెస్ కలుపుకొని ఈఎండీ చెల్లించాల్సి ఉంటుందని, ఎలాంటి సందేహాలున్నా హెచ్ఎండీఏ సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు. తెలంగాణ రాష్ర్టానికి చెందిన వారే కాకుండా దేశ పౌరులు ఎవరైనా బిడ్డింగ్లో పాల్గొన వచ్చని, దేశంలో నివసిస్తున్న ఇతర దేశస్తులకు అనుమతి ఉండదని తెలిపారు.
ప్లాట్ల విక్రయాలకు విశేష స్పందన..
ఇప్పటి వరకు రెండు దఫాలుగా జరిగిన ఉప్పల్ భగాయత్ ప్లాట్ల విక్రయాలకు అనూహ్యమైన స్పందన వచ్చిందని, ఈసారి కూడా మంచి స్పందన కనబడుతున్నదని అధికారులు తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చే ఈ ప్రాంతంలో దాదాపు 733 ఎకరాల విస్తీర్ణంలో 250 ఎకరాలలో మౌలిక వసతులు కలిగిన ఉప్పల్ భగాయత్ వెంచర్ రానున్న రోజుల్లో హైదరాబాద్కు తలమానికంగా నిలుస్తుందని వివరించారు.
150 గజాల నుంచి..
విజయవాడ, వరంగల్ జాతీయ రహదారులకు సమీపంలో క్లియర్ టైటిల్స్తో అందరికీ అందుబాటులో 150 గజాల నుంచి మొదలుకొని ఐదువేల గజాల వరకు ప్లాట్లు ఉన్నాయి. ఇన్నర్, ఔటర్ రింగు రోడ్డుకు మధ్యలో ఉండటం, నాగోల్-పీర్జాదిగూడ మధ్య లింకు రోడ్డు అందుబాటులోకి రానుంది. ఆస్పత్రులు, షాపింగ్ కమ్ ఎంటర్టైన్మెంట్, మల్టీపర్పస్ యూజ్ కోసం ఇక్కడి స్థలాలు అందుబాటులో ఉన్నాయని అధికారులు ఉప్పల్ భగాయత్ లేఅవుట్ ప్రత్యేకతలను వివరించారు.
డిసెంబర్ 2,3 తేదీల్లో ఆన్లైన్ వేలం..
హెచ్ఎండీఏ, ఎంఎస్టీసీలు కలిసి డిసెంబర్ 2,3 తేదీల్లో ఉప్పల్ భగాయత్ లే అవుట్లోని 44 ప్లాట్ల వేలంను ఆన్లైన్లో నిర్వహిస్తున్నాయి. ఆన్లైన్ బిడ్డింగ్లో ప్లాట్లను దక్కించుకున్న వారు 90 రోజుల్లో పూర్తి స్థాయి చెల్లింపులు చేస్తే 15 రోజుల్లో హెచ్ఎండీఏ వారికి ప్లాట్ రిజిస్ట్రేషన్ చేస్తుందని చెప్పారు. కొనుగోలుదారులు ప్లాట్ మొత్తం విలువలో 25 శాతం చెల్లింపులు జరిపితే మిగతా మొత్తం బ్యాంక్ రుణంగా పొందే అవకాశం ఉందన్నారు. ఉప్పల్ భగాయత్ ప్రాంతం జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నప్పటికీ భవన నిర్మాణ అనుమతులు హెచ్ఎండీఏ మాత్రమే ఇస్తుందని స్పష్టం చేశారు.