పీడీఎస్ బియ్యాన్ని బ్లాక్మార్కెట్కు తరలించే వారిపై సిటీ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తీరు మార్చుకోని అక్రమార్కులపై ఏకంగా పీడీ యాక్ట్ను ప్రయోగిస్తున్నారు. మరోవైపు బియ్యాన్ని విక్రయించే లబ్ధిదారులను కూడా గుర్తించి.. కఠిన చర్యలు తీసుకునేందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు సిద్ధమవుతున్నారు.
హైదరాబాద్ జిల్లా పరిధిలో దారిద్య్ర రేఖ దిగువన ఉన్న 6,36,610 కుటుంబాలు రేషన్ కార్డులు కలిగి ఉన్నాయి. పోర్టబులిటీ రావడంతో ఎక్కడ ఉన్నా.. రేషన్ తీసుకునే వెసులు బాటు ఉంది. అయితే రేషన్ బియ్యాన్ని ప్రభుత్వం ఉచితంగా అందిస్తుండటంతో కొందరు వాటిని బయట మార్కెట్లో రూ. 8 నుంచి రూ. 12కు కిలో చొప్పున్న విక్రయిస్తున్నారు. ఈ వ్యవహారంపై జిల్లా పౌరసఫరాల అధికారులకు ప్రతి నెల 30 నుంచి 40 ఫిర్యాదులు అందుతున్నాయి. అలాగే పోలీసులకు కూడా బియ్యం అక్రమ దందాపై ఫిర్యాదులు రావడంతో కేసులు నమోదు చేసి.. పౌరసరఫరాల శాఖకు అప్పగిస్తున్నారు.
కేసులు నమోదు..
ప్రభుత్వం పేదల కోసం అందిస్తున్న రేషన్ బియ్యాన్ని కొందరు లబ్ధిదారులు అమ్ముకుంటున్నారు. ఇలాంటి వారిపై తరచూ కేసులు నమోదువుతున్నాయి. గతంలో రేషన్ బియ్యం తరలిస్తూ..పట్టుబడి..మళ్లీ అదే దందా చేసే అక్రమార్కులపై పీడీ యాక్టులతో ఉక్కుపాదం మోపుతున్నారు. ఇలా పీడీఎస్ బియ్యాన్ని అక్రమ మార్గంలో సేకరిస్తూ..బ్లాక్మార్కెట్కు తరలించిన మహ్మద్ దావూద్ అనే వ్యక్తిపై ఇటీవల సిటీ పోలీసులు పీడీ యాక్టు ప్రయోగించారు. రేషన్ బియ్యాన్ని అమ్మినా, కొన్నా.. నేరమే అవుతుందని హెచ్చరిస్తున్నారు.
పీడీ యాక్టులతో ఉక్కుపాదం
ప్రభుత్వం అందించే ఉచిత బియ్యాన్ని పక్కదారి పట్టిస్తూ, తమ తీరును మార్చుకోని అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ఇలాంటి వారిపై ఇప్పటికే పోలీసు శాఖ పీడీయాక్టులు ప్రయోగిస్తున్నది. రేషన్ బియ్యం అవసరముంటేనే తీసుకోవాలని లబ్ధిదారులకు సూచిస్తున్నాం. ఒక నెల తీసుకోకపోతే రేషన్కార్డు కట్ అవుతుందనే అపోహలు వద్దు.