మేడ్చల్/శామీర్పేట, నవంబర్ 14;మహానగరంలో క్షణం తీరికలేకుండా నివసించే నగరవాసులకు ఆహ్లాదం కల్పించాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అర్బన్ లంగ్స్పేస్ పార్కులకు ప్రాధాన్యతనిస్తోంది.నగరంలో ఉన్న ఖాళీ స్థలాలు,శివారు ప్రాంతాల్లో ఉన్న అటవీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వనసంపదను పెంచి అడవులను సృష్టిస్తోంది. అందులో ఆహ్లాదకరంగాగడిపేందుకు అవసరమైన సౌకర్యాలను కల్పిస్తోంది. మేడ్చల్ నియోజక వర్గంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో 9 అర్బన్ పార్కులు ఉండగా, తాజాగా వెదురువనం వచ్చి చేరింది. అయితే ఈ వనాన్ని అటవీ అభివృద్ధి సంస్థ నిర్వహిస్తోంది.
ఔటర్ రింగ్ రోడ్డుకి సమీపంలో తూంకుంట మున్సిపాలిటీ పరిధిలో అటవీ అభివృద్ధి సంస్థ వెదురువనం పార్కును ఏర్పాటు చేసింది. 2000 సంవత్సరంలోనే ప్రారంభించినప్పటికీ ఉమ్మడి రాష్ట్రంలో పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోలేదు. నగరానికి అంత్యంత సమీపంలో ఉన్న తూకుంటలోని పార్కును రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రధ్ధతో అభివృద్ధి చేసింది. అటవీ అభివృద్ధి శాఖ వైస్ చైర్మన్, ఎండీ చంద్రశేఖర్ రెడ్డి పార్కును అక్టోబర్ 28న ప్రారంభించారు. అప్పటి నుంచి సందర్శకులను అనుమతిస్తున్నారు. పార్కు రాజీవ్ రహదారిపైన ఉన్న తూం కుంట నుంచి 1.5 కిలో మీటర్ల దూరంలో, మండల కేంద్రమైన శామీర్పేట నుంచి మూడు కిలో మీటర్ల దూరంలో ఉంది.
75 ఎకరాలు.. అన్ని హంగులు
75 ఎకరాల్లో వెదురు వనాన్ని ఏర్పాటు చేశారు. వెదురు వృక్షాలతో ఏర్పాటు చేసిన పార్కు రాష్ట్రంలో ఇది మొదటిది. ఈ వెదురువనంలో సందర్శకుల కోసం 2.5 కిలో మీటర్ల వాకింగ్ ట్రాక్, 2.73 కిలో మీటర్ల సైక్లింగ్ ట్రాక్ను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఆనందంగా సైక్లింగ్ చేయడానికి అద్దె ప్రాతిపదికన సైకిళ్లను కూడా నిర్వాహకులు సిద్ధం చేశారు. అలాగే చిన్నారులు ఆడుకోవడానికి అవసరమైన ఆట స్థలాన్ని ఏర్పాటు చేశారు. హరిత అందాలను వీక్షించడానికి వాచ్ టవర్ను నిర్మించారు. సందర్శకులకు అవసరమైన టాయిలెట్స్ తదితర సౌకర్యాలను అభివృద్ధి చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సందర్శకులను అనుమతిస్తారు. సందర్శనతో పాటు ఫొటో షూట్, సినిమా షూటింగ్లకు కూడా అనుమతిస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. వాకర్ పాస్కు నెలకు రూ.200, ఏడాదికి రూ.1500, సీనియర్ సిటిజన్స్కు రూ.1200 చెల్లిస్తే సరిపోతుంది.
ఆహ్లాదంగా ఉంటుంది
సందర్శకులు ఆహ్లాదకరంగా గడపడానికి పార్కు అనువుగా ఉంటుంది. నగర శివారులో ఉన్న ఈ పార్కులో ప్రవేశిస్తే ప్రశాంత వాతావరణం మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ప్రస్తుతం కార్తికమాసం కావడంతో వన భోజనాలకు ఈ పార్కును వినియోగించుకోవాలి. ఈ పార్కులో ఉన్న సైక్లింగ్ చేస్తే ఎంతో ఆనంద అనుభూతిని ఇస్తుంది.
– నీలకంఠం,అటవీశాఖ రేంజ్ అధికారి