మేడ్చల్ కలెక్టరేట్, ఫిబ్రవరి 14 : రాంపల్లి-చర్లపల్లికి వెళ్లే దారిలో సోమవారం ఓ రసాయన గోదాంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఉదయం 11 గంటలకు మంటలు చెలరేగడంతో గమనించిన స్థానికులు.. పోలీసులకు, ఫైర్ స్టేషన్కు సమాచారం అందించారు. అప్పటికే పరిసరాల్లో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. గోదాంకు ఆనుకొని ఉన్న విశ్వకర్మ ఫర్నీచర్ కంపెనీలో మంటలు వ్యాపించాయి. రసాయన గోదాంలో ట్యాంకర్, ఫర్నీచర్ కంపెనీలో విలువైన సామగ్రి కాలి బూడిదయ్యాయి. ఫైర్ సిబ్బంది నాలుగు గంటల పాటు శ్రమించి..మంటలను అదుపులోకి తెచ్చారు. సంఘటనకు గల కారణాలు తెలియరాలేదు. కోట్లలో నష్టపోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.