సిటీ బ్యూరో, సెప్టెంబర్ 25, (నమస్తే తెలంగాణ): వైద్యురాలైన మేనత్తలా డాక్టర్ కావాలని అనుకునేవాడనని తన చిన్న నాటి కలను ఇండియన్ మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ వెల్లడించారు. ప్రపంచంలోనే ఎంతో గొప్పనైనది వైద్య వృత్తి అని, 24 గంటలు రోగులకు సేవలు అందించే డాక్టర్లు, వైద్య సిబ్బంది దైవదూతలతో సమానమని కొనియాడారు. నానక్ రాంగూడలోని స్పర్శ్ హాస్పైస్ సెంటర్ను ఆయన ఆదివారం సందర్శించారు.
ఇండో-ఆస్ట్రేలియా టీ20 ఫైనల్ మ్యాచ్ కోసం హైదరాబాద్ వచ్చిన ఆయన.. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ జీవిత చరమాంకంలో ఉన్న వారికి ఈ సెంటర్లో అందిస్తున్న సేవల గురించి తెలుసుకున్నారు. వైద్యం పొందుతున్న రోగులను, సెంటర్లో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రోటరీ, ట్రస్ట్ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. సేవా దృక్పథంతో అనిర్వచనీయమైన సేవలు అందిస్తున్న ట్రస్టుకు, అందుకు అన్ని విధాలుగా సహకరిస్తున్న ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు.
ప్రాణాంతక వ్యాధుల కంటే సమాజం నుంచి వచ్చే నెగిటివ్ ఆలోచనలే భయంకరమైనవన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మెరుగైన వైద్య సేవల కంటే ప్రేమ పూర్వకంగా అందించే సేవలు రోగికి మేలు చేస్తాయన్నారు. విభిన్న ఆలోచనలతో రోటరీ ట్రస్ట్ చేస్తున్న సేవలను ప్రశంసించారు. ట్రస్ట్ నిర్వహణకు సహకరిస్తున్న దాతలను అభినందించి, ప్రశంసాపత్రాలను సునీల్ గవాస్కర్ చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మోహన్ హిమాడి, జగదీశ్ రామడుగు, డా. ఎన్ సుబ్రమణ్యం, సురేశ్ రెడ్డి, మనోహర్రెడ్డి, రోటరీ క్లబ్ సభ్యులు, సెంటర్ హెడ్ కె శశిధర్ తదితరులు పాల్గొన్నారు.