-సిటీబ్యూరో, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ) :‘జై బోలో గణేశ్ మహరాజ్కీ జై, గణపతిబప్పా మోరియా, వెళ్లిరా వినాయక’ నినాదాలతో ట్యాంక్బండ్ పరిసరాలు మార్మోగాయి. నిమజ్జనోత్సవాన్ని వీక్షించేందుకు సందర్శకులు భారీఎత్తున వచ్చారు. ఆట పాటలతో యువత సందడి చేశారు. చిందులేస్తూ ఆహ్లాదంగా గడిపారు. చిట్టి గణేశుల నుంచి భారీ విగ్రహాల వరకు విభిన్న ఆకారాల్లో భక్తులను కనువిందు చేశాయి. నిమజ్జనోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడంతో భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా గణనాథుల నిమజ్జనం వీక్షించారు. విభిన్న రకాల తినుబండారాల వ్యాపారం జోరుగా సాగింది. మరోవైపు చిన్నారులు మహాత్మాగాంధీ వేషాధారణలో ఆకట్టుకున్నారు. వారితో సెల్ఫీలు దిగడానికి సందర్శకులు పోటీపడ్డారు. కాగా, సెల్ఫీ దిగాలంటే కొంత ఛార్జీ చేసి ఆ బుడతలు డబ్బులు సంపాదించడం విశేషం. కుటుంబసమేతంగా నగరవాసులు నిమజ్జనోత్సవానికి తరలివచ్చి గణనాథుడిపై తమ భక్తిని చాటుకున్నారు.
మేడ్చల్ జిల్లాలో..
మేడ్చల్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలో శుక్రవారం రాత్రి 8 గంటల వరకు 2,100 వినాయకులు నిమజ్జనమైనట్లు అధికారులు తెలిపారు. నిమజ్జనం సందర్భంగా జిల్లాలో 2000 మంది పోలీసులు బందోబస్తును నిర్వహిస్తున్నారు.