నేరేడ్మెట్, నవంబర్ 11 : ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుల నుంచి మహారాష్ట్ర, కర్ణాటకకు గంజాయిని తరలిస్తున్న నలుగురు నిందితులను మల్కాజిగిరి ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. నిందితుల నుంచి దాదాపు రూ. కోటి 5లక్షలు విలువజేసే 462 కిలోల గంజాయి, రెండు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. గురువారం మల్కాజిగిరి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో రంగారెడ్డి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ టి. డేవిడ్ రవికాంత్, జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారి డి. అరుణ్ కుమార్ విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. స్వరాజ్ మజ్దా వాహనంలో గంజాయి తరలిస్తున్నట్లు మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులకు విశ్వసనీయ సమాచారం వచ్చింది. దీంతో బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో కౌకూర్ ఎంబీ దర్గా చౌరస్తాలో వాహనాలు తనిఖీ చేశారు. స్వరాజ్ మజ్దా వాహనం తనిఖీ చేయగా దాదాపు రూ. కోటి 5లక్షలు విలువజేసే 462 కిలోల గంజాయి దొరికింది. ఆరా తీయగా ఆత్మకూరుకు చెందిన ఎం.ఏ. ఫరీదా (25), జహీరాబాద్కు చెందిన ఎండీ.ఇస్మాయిల్ (24), బీదర్కు చెందిన చావన్ సచిన్ (19), జహీరాబాద్కు చెందిన బస్వరాజ్ (22)గా గుర్తించారు. ఈ నలుగురు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రెండు కార్లను, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మల్కాజిగిరి ప్రొహిబిషన్, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎం.లక్ష్మణ్సింగ్, మల్కాజిగిరి ప్రొహిబిషన్, ఎక్సైజ్ ఎస్సైలు కె. బాలకృష్ణ, కె.సమజ, ఎ. శ్రావణిని రంగారెడ్డి జిల్లా డివిజన్ డిప్యూటీ కమిషనర్ టి.డేవిడ్ రవికాంత్ అభినందిచారు.
అరుంధతి నగర్లో..
జవహర్నగర్, నవంబర్ 11 : జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధి అరుంధతి నగర్లోని ఓ ఇంట్లో గంజాయి మొక్కలు పెంచుతున్నట్లు సమాచారం అందుకున్న జవహర్నగర్ సీఐ భిక్షపతిరావు గురువారం ఆ ఇంటిపై దాడులు నిర్వహించారు. అంబులెన్స్ డ్రైవర్గా పనిచేసే ఆయాజ్ఖాన్ ప్రస్తుతం మేకలు కాస్తూ, అద్దె ఇంట్లో ఉంటూ గంజాయి మొక్కలు పెంచుతున్నట్లు గుర్తించి సుమారు నాలుగు కేజీల గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
గంజాయి తరలిస్తున్న ఇద్దరు అరెస్టు
మహేశ్వరం, నవంబర్ 11: గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని మహేశ్వరం పోలీసులు పట్టుకున్నారు. మహేశ్వరం సీఐ మధుసూదన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 3న మంఖాల్ వద్ద కమలేశ్ సింగ్ గంజాయితో పట్టుబడ్డాడు. అతడిని విచారించగా షేక్ మసూద్, సంజయ్సింగ్ పేర్లను వెల్లడించడంతో బుధవారం వారిని మన్సాన్పల్లి వద్ద పట్టుకున్నారు. వారివద్ద నుంచి 280 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకొని జ్యుడిషియల్ రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు.
గంజాయి మొక్కను పెంచుతున్న వ్యక్తి అరెస్టు
మేడ్చల్, నవంబర్ 11 : గంజాయి మొక్కను పెంచుతున్న వ్యక్తిని మేడ్చల్ పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఐ అప్పారావు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ మండలం డబిల్పూర్ గ్రామంలోని సర్వేనంబర్ 711లో ఆకుల నర్సింహ (50) గంజాయి మొక్క పెంచుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు గురువారం ఉదయం దాడులు నిర్వహించారు. అతడిని అదుపులోకి తీసుకుని గంజాయి మొక్కను స్వాధీనం చేసుకున్నారు.