సిటీబ్యూరో,సెప్టెంబర్4 (నమస్తే తెలంగాణ)/చాంద్రాయణగుట్ట: ప్రతి ఆదివారం తప్పనిసరిగా ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని, దోమ లార్వా పెరగకుండా చూసుకోవాలని ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు సూచించారు. ఆదివారం తన నివాసంలో 10 గంటలకు 10 నిమిషాలు డెంగీ వ్యాధి నివారణ కార్యక్రమంలో చార్మినార్ జోన్ సీనియర్ ఎంటమాలజిస్ట్ నామాల శ్రీనివాస్, మిగతా నాయకులతో కలిసి ఇంటి ఆవరణలో నీటి నిల్వలను తొలగించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ దోమల నివారణలో ప్రజలు భాగస్వామ్యం కావాలి పిలుపునిచ్చారు. దోమ లార్వాను తోక పురుగులు అనుకోని వదిలివేయడం వల్ల దోమలు పెరుగుతున్నాయని ఆయన తెలిపారు.
సెప్టెంబర్, నవంబర్ నెలల్లో డెంగీ నివారణ కోసం అధికారులు చర్య లు తీసుకోవాలని, ప్రజలను చైతన్య చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన చార్మినార్ జోన్ సీనియర్ ఎంటమాలజిస్ట్ నామాల శ్రీనివాస్ తయారు చేసిన సండే 10 గంటలకు 10 నిమిషాల క్యాంపెయిన్ వీడియో, ప్రచార సామగ్రిని మంత్రి విడుదల చేశారు.
ఎంపీ రంజిత్ రెడ్డి కూడా తన నివాసంలో స్థానిక కార్పొరేటర్లు, నాయకులతో కలిసి ప్రచార సామగ్రిని విడుదల చేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ఎంటమాలజిస్ట్ ఉదయ్ కిరణ్, తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.