భాగ్యనగరంలో ఆఫీస్ స్పేస్లకు డిమాండ్ పెరిగిపోతున్నది. హాట్ కేకులా.. బుక్కవుతున్నాయి. గత సంవత్సరంలోనే దూకుడు మీదున్న రియల్ మార్కెట్ ఈ ఏడాది మరింత ఊపందుకోనున్నది. ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్కు స్వస్తి చెప్పడంతో ఉద్యోగులంతా ఆఫీస్ బాట పడుతున్నారు. దీనికి తోడు నగరంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనతో ఫిదా అవుతున్న అంతర్జాతీయ కంపెనీలు భాగ్యనగరానికి క్యూ కడుతున్నాయి. దీంతో హాట్ కేక్లా ఆఫీస్ స్పేస్లు ఎగిరి పోతున్నాయి. ఇప్పటికే బిల్డర్లు 80 లక్షల చదరపు అడుగుల్లో ఆఫీస్ స్పేస్లు ఏర్పాటు చేస్తుండగా.. భవిష్యత్తులో కోటి పైచిలుకు చదరపు అడుగుల్లో ఆఫీస్ స్పేస్ల ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. ఏది ఏమైనా.. అంతర్జాతీయ కంపెనీలకు అడ్డాగా మారిన హైదరాబాద్ దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తున్నది.
సిటీబ్యూరో, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ) : దేశంలోనే టాప్ ఆఫీస్ స్పేస్ మార్కెట్లలో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలువనున్నది. 2022లో 80 లక్షల చదరపు అడుగుల (8 మిలియన్లు) విస్తీర్ణంతో కూడిన ఆఫీస్కు నగరంలో డిమాండ్ ఉంటుందని రియల్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనిపై సావిల్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ శేషసాయి మాట్లాడుతూ తెలంగాణలో చురుకైన ప్రభుత్వ విధానాలు, అద్భుతమైన మౌలిక సదుపాయాలు, ప్రతిభ కలిగిన నిపుణులు, భద్రత వంటి అంశాలు ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ కంపెనీల కార్యకలాపాలకు ఎంతో అనుకూలంగా మారాయని తెలిపారు. 2021లో ఆఫీస్ స్పేస్కు డిమాండ్ పెరిగినట్లుగానే 2022లో సైతం ఐటీ, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగాలకు చెందిన కంపెనీలు తమ కార్యాలయాల ఏర్పాటుకు ముందుకు వస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ఏడాదిలో 80 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్కు డిమాండ్ పెరిగిపోతున్నదని, దీంతో హైదరాబాద్ నగరం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచే అవకాశం ఉందని పేర్కొన్నారు.
లీజుకు తీసుకునేందుకు ఆసక్తి
దేశంలోని ఇతర నగరాల్లోని ప్రీమియం ఆఫీస్ స్పేస్ భవనాలతో పోల్చితే హైదరాబాద్లో ఎక్కువగా డిమాండ్ ఉందన్నారు. అంతర్జాతీయ కంపెనీలు మధ్యవర్తుల ద్వారా స్థలాలను లీజుకు తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు.
భవిష్యత్తులో కోటికిపైగా చదరపు అడుగులు
కరోనా ప్రభావం క్రమంగా తగ్గుముఖం పట్టడంతో ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోంను ఎత్తేస్తున్నాయి. లక్షలాదిమంది ఐటీ, ఐటీఈఎస్ ఉద్యోగులు కార్యాలయాలకు రావాల్సి ఉంటుంది. దీంతో ఆఫీస్ స్పేస్లకు ఎక్కువగా డిమాండ్ పెరుగుతున్నదని శేషసాయి తెలిపారు. భవిష్యత్ డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని రియల్ ఎస్టేట్ బిల్డర్లు కోటి చదరపు అడుగుల విస్తీర్ణం నుంచి 1.20కోట్ల వరకు ఆఫీస్ స్పేస్తో కూడిన భవనాలను నిర్మించేందుకు ఆసక్తి చూపుతున్నారు. గతేడాది 57 లక్షల చదరపు అడుగుల (5.7 మిలియన్లు) విస్తీర్ణంలో లావాదేవీలు జరిగాయి.