జూబ్లీహిల్స్ జోన్ బృందం, ఫిబ్రవరి 9 : అమరుల త్యాగాలను అవహేళన చేయడమేగాక రాజ్యాంగబద్దంగా ఏర్పాటైన తెలంగాణను అవమానించిన ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ డిమాండ్ చేశారు. గుజరాత్ కంటే గణనీయంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణపై అక్కసుతో రాష్ట్ర అభివృద్దిని సైతం అడ్డుకుంటూ.. చట్టసభల సాక్షిగా తెలంగాణ ప్రజలను అవమానించిన మోదీ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం కార్పొరేటర్లు దేదీప్య విజయ్, బాబాఫసియుద్దీన్, రాజ్కుమార్ పటేల్, సీఎన్రెడ్డిలతోపాటు టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆయా డివిజన్లో ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం చేసి బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలను అవమానించడమే అలవాటుగా మార్చుకున్న ప్రధాని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి రాజీనామా చేయకుంటే ఢిల్లీవచ్చి ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా యూసుఫ్గూడ, బోరబండ, రహ్మత్నగర్, ఎర్రగడ్డ డివిజన్ల నుంచి గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్దకు వెళ్లి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సంజీవ, ప్రదీప్, అప్పూఖాన్, సంతోష్, కృష్ణమోహన్లతో పాటు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఎర్రగడ్డలో…
ఎర్రగడ్డ, ఫిబ్రవరి 9 : పార్లమెంట్ సాక్షిగా తెలంగాణపై విషం కక్కడంతో ప్రధాని మోదీపై నిరసనలు వెల్లువెత్తాయి. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు బోరబండ, ఎర్రగడ్డ డివిజన్లలో గులాబీ శ్రేణులు నల్ల జెండాలను చేతబూని ప్రధాని వ్యాఖ్యలకు నిరసనగా నినాదాలు చేశారు. బోరబండ చౌరస్తా వద్ద కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ నేతృత్వంలో మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం మోతీనగర్ చౌరస్తా వరకు కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి అక్కడున్న తెలంగాణ తల్లి, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు కృష్ణమోహన్, నేతలు విజయకుమార్, ఏడీ మధు, లక్ష్మణ్గౌడ్, రవినాయుడు, ఆనంద్, ధర్మ, యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు.