ఖైరతాబాద్, ఫిబ్రవరి 7 : ‘ఆరోగ్య తెలంగాణ నిర్మించాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు సాగుతున్నారు. హైదరాబాద్ నగరానికి నలుదిక్కులా వెయ్యి పడకలతో సూపర్ స్పెషాలిటీ వైద్యశాలల ఏర్పాటు జరుగుతున్నది’ అని రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. లక్డీకాపూల్లోని వాసవి ఆస్పత్రిలో కార్డియాలజి ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్డియో థోరాసిక్ సర్జరీ విభాగంతో పాటు శ్రీ నేత్రాలయ కంటి ఆస్పత్రి, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తల్లిదండ్రులు దివంగత ఉప్పల అనంత లక్ష్మి, విశ్వనాథం పేరిట ఏర్పాటు చేసిన భోజనశాలను మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్, తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలెటి దామోదర్, కార్పొరేటర్ పి.విజయా రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం వాసవి హాస్పిటల్ చైర్మన్ గంజి రాజమౌళి గుప్తా అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి హరీశ్ రావు మాట్లాడారు.
“వాసవి” సేవలు అద్భుతం
పేద వైశ్యులకు వైద్యం అందించాలన్న దూరదృష్టిలో ఆ రోజుల్లో వాసవి ఆస్పత్రిని ప్రారంభించారని మంత్రి హరీశ్రావు తెలిపారు. ప్రస్తుతం ఈ దవాఖానలో అన్ని వర్గాల వారికి వైద్యసేవలందిస్తున్నారని అన్నారు. ‘వాసవి’ సేవా, సామాజిక సేవా కార్యక్రమాలు అద్భుతంగా ఉంటాయని కొనియాడారు. సీఎం కేసీఆర్ వైశ్యుల సంక్షేమానికి అనేక రకాలుగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
జిల్లా దవాఖానల్లో క్యాథ్ల్యాబ్లు
గుండె చికిత్సలో కీలకమైన క్యాథ్ల్యాబ్లు గతంలో కేవలం ఉస్మానియా, గాంధీ దవాఖానలకే పరిమితం కాగా.., ఇప్పుడు సీఎం కేసీఆర్ ఆశీస్సులతో రూ.7.50 కోట్ల వ్యయంతో వరంగల్, ఖమ్మం, అదిలాబాద్ జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతం అక్కడ ఉచితంగా గుండెకు శస్త్రచికిత్సలు చేస్తున్నారన్నారు.
నగరానికి నలుదిక్కులా..సూపర్స్పెషాలిటీ దవాఖానలు
సర్కార్ దవాఖానల్లో ఐసీయూ, డయాలసిస్ కేంద్రాలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశామని మంత్రి హరీశ్రావు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో హైదరాబాద్ నలుదిక్కుల ఎల్బీనగర్లోని గడ్డి అన్నారం, సనత్నగర్లోని ఎర్రగడ్డ దగ్గర, అల్వాల్ రాజీవ్ రహదారిలో వెయ్యి పడకల సామర్థ్యం కలిగిన సూపర్స్పెష్టాలిటీ ప్రభుత్వ ఆస్పత్రులను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
మంచాలు, మందులు లేవన్న ప్రశ్న రావద్దు
రాష్ట్రంలోని వైద్యశాలల్లో మంచాలు, మందులు లేవన్న ప్రశ్నే రాకుండా పెద్ద ఎత్తున వైద్యరంగాన్ని అభివృద్ధి చేస్తున్నామని మంత్రి హరీశ్రావు తెలిపారు.
నిమ్స్ దవాఖానలో ప్రస్తుతం 1450 పడకలు ఉండగా.. మరో వెయ్యి పడకలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, త్వరలోనే కార్యరూపం దాలుస్తుందని మంత్రి హరీశ్రావు తెలిపారు. నిమ్స్లో ఆధునిక పరికరాల కోసం రూ.257 కోట్లు మంజూరు చేశామన్నారు.
ఎంసీహెచ్ ఆస్పత్రిలో గర్భిణుల కోసం మరో 200 పడకలను పెంచబోతున్నామన్నారు.
ఎంఎన్జే క్యాన్సర్ ఆస్పత్రిలో గతంలో 350 పడకలుండగా.. మరో 400 పడకలు పెంచామని తెలిపారు.
ఏయిమ్స్ తరహాలో టిమ్స్ను అప్గ్రేడ్ చేస్తామన్నారు.
డాక్టర్లు, స్టాఫ్ నర్సుల ఖాళీలు భర్తీ చేయనున్నామని, ఒక్క పోస్టు కూడా ఖాళీ లేకుండా చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని తెలిపారు.
ఆయుష్మాన్ భారత్ కంటే.. ఆరోగ్యశ్రీయే బెస్ట్
తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ను అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఆ పథకంలో కేవలం 26లక్షల కుటుంబాలకు మాత్రమే సేవలందుతాయని, తెలంగాణ ఆరోగ్యశ్రీ ద్వారా 87.50లక్షల మందికి ఉచిత వైద్య సేవలందిస్తున్నామని చెప్పారు. ఆరోగ్యశ్రీలో రూ.2లక్షల వరకే పరిమితి ఉండగా.. ఇటీవల రూ.5లక్షలు వరకు ఉచితంగా సేవలందించాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ వైద్యశాలల్లో దీన్ని వర్తింప చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో వాసవి దవాఖాన ప్యాట్రన్ దిడిగే జయంత్, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ కొండా కృష్ణయ్య, కార్డియాలజిస్ట్ డాక్టర్ వి.సూర్యప్రకాశ్ రావు, సీనియర్ ఇంటర్వేన్షనల్ కార్డియాలజిస్ట్, క్యాథ్ల్యాబ్ ఇన్చార్జి డాక్టర్ ఆర్.విశ్వనాథ్, హార్ట్ ట్రాన్స్పాంట్ సర్జన్ డాక్టర్ నగేశ్, ప్రధాన కార్యదర్శి కక్కిరాల రమేశ్, ముఖ్య సలహాదారులు జి.చంద్రయ్య, వైస్ చైర్మన్ కొండ్లె మల్లికార్జున్, కార్డియాలజి ఇనిస్టిట్యూట్ మేనేజింగ్ డైరెక్టర్ వై.నాగేశ్వర్ రావు, తదితరులు పాల్గొన్నారు.