ఖైరతాబాద్, ఫిబ్రవరి 7 : ‘రాజ్యాంగ మార్పుపై దేశ వ్యాప్తం గా చర్చ జరగాలి.. సీఎం కేసీఆర్ ఏ సందర్భంలో అన్నారో గ్రహించాలి.. ఆయన వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకోవద్దు’ అని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం అన్నారు. బీజేపీ కేంద్ర మంత్రి, కర్నాటక మంత్రులు రాజ్యాంగాన్ని మార్చాలని బహిరంగంగా ప్రకటించారని, ప్రధాని నరేంద్ర మోడీ దగ్గరి వ్యక్తులు సైతం ఇదే వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. లక్డీకాపూల్లోని హోటల్ సెంట్రల్ కోర్టులో సోమవారం ఆయన మీడియా సమావేశంలో బీజేపీ నేతల వ్యాఖ్యలు, వారి తీరుపై నిప్పులు చెరిగారు. రాజ్యాంగాన్ని మార్చే అధికారం ముఖ్యమంత్రులకు ఉండదన్న వాస్తవం బీజేపీ నేతలకు తెలియదా.. అని ప్రశ్నించారు. నేడు రాజ్యాంగంపై దేశ వ్యాప్తంగా చర్చ ప్రారంభమైందంటే అది సీఎం కేసీఆర్ మాట్లాడటం వల్లనేనని, దీన్ని లోతుగా పరిశీలిస్తే వాస్తవాలు, బీజేపీ కుట్రలు బయటపడుతాయన్నారు. దేశంలో ఎన్నో సార్లు సవరణలు చేశారని, అది కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలే చేశాయని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఒక్కటై మతిభ్రమించి మాట్లాడుతున్నారని తెలిపారు. రాజ్యాంగం మార్చే కుట్రకు కేంద్రమే తెరలేపిందన్నారు.
బీజేపీ అధికారంలోకి వచ్చాకే దళితులపై దాడులు
2014 నుంచి కేంద్రంలో ఉన్న బీజేపీ రాజ్యంగాన్ని సవరణలు చేస్తూనే ఉందన్నారు. అందులో భాగంగానే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తున్నారని, నేడు సింగరేణిని కూడా ప్రైవేట్కు అప్పగించే యోచనలో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు దళితులకు ఏం చేశారని ప్రశ్నించారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక దళితులపై లైంగికదాడులు, దౌర్జన్యాలు, దాడులు పెరిగాయన్నారు. 40 కోట్ల దళితులకు బడ్జెట్లోనూ అన్యాయం చేశారని మండిపడ్డారు.
సిగ్గులేకుండా భీం దీక్షలు
దళితులకు కేంద్రం ఏం చేసిందో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పాలని డిమాండ్ చేశారు. 6వేల మంది దళిత బిడ్డలను చంపితే నోరు విప్పని ఆ పార్టీ నేతలు నేడు సిగ్గులేకుండా భీం దీక్షలు చేపడుతున్నారని విమర్శించారు. ఆ పార్టీ నేతలకు జై భీమ్ అనే అర్హత లేదని, ఎన్నికల కోసమే ఈ నినాదం ఎత్తుకున్నారని విమర్శించారు. యూపీలో యోగి పాలనలో దళితులపై రోజు రోజుకు దాడులు పెరుగుతున్నాయని, ఆయన కెబినేట్లో ఉన్న మంత్రి, పలువురు బహుజన ఎమ్మెల్యేలు రాజీనామా చేశారని, దీన్ని బట్టి ఆ పార్టీతో దళిత, గిరిజనులకు ఒరిగేదేమి లేదన్నారు.
దళితుల సంక్షేమానికి పాటుపడుతున్న ఏకైక సీఎం కేసీఆర్
రాజ్యాంగంపై చర్చ జరగాలని సీఎం కేసీఆర్ అంటే తప్పేందని, బడ్జెట్లో రాష్ర్టాలకు అన్యాయం చేశారని సీఎం నేరుగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం దళిత గిరిజనులకు అన్ని రకాలుగా న్యాయం చేస్తున్నదని, వారి సంక్షేమానికి పాటుపడుతుందని తెలిపారు. కేంద్రం రాష్ర్టాల హక్కులను కాలరాస్తుందని మండిపడ్డారు. ఈ సమావేశంలో బి.సురేందర్ సన్ని, కొమ్ము తిరుపతి, నర్సయ్య, సంతోశ్ కుమార్, బాలరాజు, వెంకటేశ్, మల్లేశ్, సుమలత, సుద్దాల లక్ష్మణ్, అజయ్, తదితరులు పాల్గొన్నారు.