మణికొండ, ఫిబ్రవరి 5: వేదం నమామి.. సదాస్మరామి అన్నది వేదవాజ్ఞయ నార్యోక్తి. మానవుడి జీవనయానంలో సంస్కృతి, సంప్రదాయాలు క్రమక్రమంగా కనుమరుగై పోతున్నాయి. వేద పండితుల సంఖ్య నానాటికీ తగ్గిపోతున్నది. ఈ క్రమంలో దేశంలోని శృంగేరి(కర్నాటక), పూరి జగన్నాథ్(ఒరిస్సా), బద్రినాథ్(ఉత్తరాంచల్), ద్వారకా(గుజరాత్) పీఠాలతో పాటు మన రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ శ్రీరామనగరంలోని చినజీయర్ స్వామి ఆశ్రమం సనాతన ధర్మాన్ని కాపాడడానికి శ్రీకారం చుట్టింది. వివిధ ప్రాంతాలలో వేద పాఠశాలలు నెలకొల్పి ఉచిత వసతి, భోజనం, బోధన, శిక్షణ సాగిస్తున్నాయి. సామ, రుగ్వేదం, యజుర్వేదం, అధర్వణతో పాటు వాటిలోని అంగాలు, ఆగమ శాస్ర్తాలు నేర్పుతూ సమాజానికి అవసరమైన వేదపండితులను అందించడంతో పాటు వేదవాజ్ఞయాన్ని పరిరక్షించడంలో ప్రధానపాత్రను పోషిస్తున్నది.
జీవా స్థాపన..
దేశంలో ప్రతిపౌరుడు సమాజ శ్రేయసును పెంచుకుంటే చాలు.. సంస్కృతి, సంప్రదాయాలతో పాటు దేశం సుభిక్షంగా ఉంటుందన్న సదుద్దేశంతో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చిన్నజీయర్ స్వామి వేదవిజ్ఞానాన్ని అందరికి అందేలా ‘జీవా గురుకులం’లో వేద విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పారు. పెద్ద జీయర్ స్వామి శతాబ్ది చిహ్నంగా 2009లో జూన్ 9న శ్రీరామనగరంలో జీవా(జీయర్ ఇంటిగ్రేటెడ్ అకాడమీ)ను స్థాపించారు. సమస్త జగత్తు సృష్టి, స్థితి రహస్యాలను తెలియజేయాలని సంకల్పించుకున్న స్వామిజీ విద్యార్థులకు చతుర్వేదాలతో మరో మూడు అంగాలను నేర్పిస్తున్నారు.
కఠినమైన బోధన..
ఇక్కడ కఠిన నియమాలతో కూడిన బోధనను అందిస్తారు. ఈ గురుకులంలో ప్రవేశాలకు 8 ఏండ్ల ప్రాయం నుంచి అన్ని వర్గాల వారిని చేర్చుకుంటారు. ప్రస్తుతం 215 మంది విద్యార్థులు ఇక్కడ వేద విద్యను అభ్యసిస్తున్నారు. తెలుగు రాష్ర్టాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్కు చెందిన వారు ఉన్నారు. ప్రవేశం పొందిన వారికి మొదటి రెండు సంవత్సరాలు ఫౌండేషన్ తరగతులు ఉంటాయి. ఆ తర్వాత జ్యోతిష్యం,శాస్త్రం, వ్యాకరణం, చతుర్వేదాలు, యజుర్వేదంలోని మూడు అంగాలను బోధిస్తారు. ఇక్కడ వేద విద్యను అభ్యసించిన వారు దేశ, విదేశాలతో పాటు ప్రధాన ఆలయాల్లో పని చేస్తున్నారు. ఇక్కడి విద్యార్థులు 12 సంవత్సరాలు వేద విద్యను అభ్యసిస్తారు. వీరికి వేద విద్యతో పాటు ఆలయాల్లో క్రతువులు నిర్వహించడం నేర్పిస్తారు. అంతేకాక ఇతర ఉన్నత చదువులు చదివే అవకాశం సైతం ఉంటుంది. ప్రతి సంవత్సరం పరీక్షలు నిర్వహించి వారి స్థాయిని నిర్ధారిస్తారు. వేద విద్యతో పాటు స్టేట్ సిలబస్ను సైతం నేర్పిస్తారు. ఇప్పటి వరకు 15 బ్యాచ్లు పరీక్షలకు హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు.