జూబ్లీహిల్స్, జనవరి 24 : కొవిడ్ కట్టడికి జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం ఆధ్వర్యంలో ముమ్మరంగా శానిటైజేషన్ పనులు చేపడుతున్నారు. పలు ప్రాంతాలతో పాటు యూపీహెచ్సీలు, బస్తీ దవాఖానల్లో సోడియం హైపోక్లోరైట్ రసాయనాలు పిచికారీ చేస్తున్నారు. యూసుఫ్గూడ సర్కిల్లో ఎంటమాలజీ ఏఈ సావిత్రి ఆధ్వర్యంలో 54 మంది సిబ్బంది ప్రతిరోజు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలల్లో శానిటైజేషన్ పనులు చేపడుతున్నారు.
అందుబాటులో మందుల కిట్లు
కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు కొవిడ్ హోమ్ ఐసొలేషన్ కిట్లు అందరికీ అందుబాటులో ఉంచుతున్నారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో పీహెచ్సీలు, బస్తీ దవాఖానల్లో ఈ కిట్లు పంపిణీకి సిద్ధంగా ఉంచుతున్నారు. ఇంటింటికీ ఫీవర్ సర్వే చేస్తున్న ఆరోగ్య కార్యకర్తలు జలుబు, జ్వరం లక్షణాలున్న వారికి హోమ్ ఐసొలేషన్ కిట్లు పంపిణీ చేస్తున్నారు. యూసుఫ్గూడ సర్కిల్లో సోమవారం 2052 గృహాల్లో సర్వేచేసి జ్వర లక్షణాలున్న 90 మందిలో 78 మందికి హోమ్ ఐసొలేషన్ కిట్లు అందజేసినట్లు అధికారులు తెలిపారు. గత నాలుగు రోజులుగా 13,866 మందికి నిర్వహించిన జ్వర సర్వేలో లక్షణాలు ఉన్న 637 మందిలో 437 మందికి హోమ్ ఐసొలేషన్ కిట్లు అందజేశారు.
లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తలు పాటించాల్సిందే..
ఇంటింటి జ్వర సర్వేలో వైద్య సిబ్బందికి సహకరించి, ఆరోగ్య పరమైన వివరాలు వెల్లడించాలని, లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తలు పాటించాల్సిందేనని శ్రీరాంనగర్ ఎస్పీహెచ్ఓ డాక్టర్ అనురాధ పేర్కొన్నారు. సోమవారం వినాయక్నగర్ పీహెచ్సీ, సుల్తాన్నగర్ బస్తీ దవాఖానల పరిధిలోని ప్రాంతాల్లో నిర్వహించిన ఫీవర్ సర్వేలో పాల్గొన్నారు. స్వల్పంగా జలుబు , జ్వరం లక్షణాలున్న వారు కూడా మందులు వాడాలని సూచించారు. లక్షణాలు ఉన్న వారు వైద్య సిబ్బంది దగ్గర హోమ్ ఐసొలేషన్ కిట్లు తీసుకోవాలని, క్రమం తప్పకుండా ఐదు రోజులు మందులు వాడాలని తెలిపారు. లక్షణాలు ఉన్న వారి వివరాలు నమోదు చేసి, వారిని ఫోన్ద్వారా పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని ఆరోగ్య సిబ్బందికి సూచించారు.
దోమలు వృద్ధి చెందకుండా జాగ్రత్తలు చేపట్టాలి
దోమలు వృద్ధి చెందకుండా తగిన జాగ్రత్త లు చేపట్టాలని, ఒక్క దోమ ఏడాది కాలంలో లక్షలాది దోమలను ఉత్పత్తి చేస్తుందని శేరిలింగంపల్లి జోన్ సీనియర్ ఎంటమాలజిస్ట్ హెచ్.మల్లయ్య పేర్కొన్నారు. ఇంటి పరిసరాలలో వర్షపు నీరు నిలువ వుండకుండా.. ఇంటి ఆవరణలో పాత వస్తువులలో నీరు లేకుండా చూడటం ద్వారా దోమల వృద్ధిని అడ్డుకోవచ్చని అన్నారు. సోమవా రం యూసుఫ్గూడ సర్కిల్లో ఎంటమాలజీ ఏఈ సావిత్రి, సిబ్బందితో కలిసి యాంటీ లార్వా ఆపరేషన్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బస్తీలు, కాలనీల్లోని ఇండ్ల ఆవరణలో ఉన్న పాత డ్రమ్ములు, వస్తువులలో నిలువవున్న నీటిని తొలగించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు హరిప్రసాద్, ప్రభు, వినయ్, సిబ్బంది పాల్గొన్నారు.