హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను, పథకాలను సద్వినియోగం చేసుకుంటూ దివ్యాంగులు అభివృద్ధి సాధించాలని వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి సూచించారు. డాక్టర్ లూయిస్ బ్రెయిలీ 213 జయంతి ముగింపు వేడుకలను లంగర్హౌజ్లోని కేకే ఫంక్షన్ హాల్లో అంతర్నేత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వాసుదేవరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అంధుల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు డాక్టర్ లూయిస్ బ్రెయిలీ అని కొనియాడారు. వచ్చే ఏడాది మలక్పేటలోని పార్క్లో బ్రెయిలీ ఏడడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నామని వివరించారు. అంధ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్టాప్స్ను అందిస్తున్నామని, వాటిని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్క విద్యార్థి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు. అనంతరం వివిధ రంగాల్లో ప్రతిభ కనబరచిన దివ్యాంగులను ఆయన సన్మానించారు. ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు గీతా చల్లా, అంధ క్రికెటర్ మాధవ్, హరీశ్ పాల్గొన్నారు.