మేడ్చల్, జనవరి 23(నమస్తే తెలంగాణ): మనిషి మల వ్యర్థాలను బహిరంగ ప్రదేశాలలో పడేయకుండా, వాతావరణం కలుషితం కాకుండా ఉండేలా, ఆ వ్యర్థాలతో ఎరువులను తయారు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం వ్యర్థాలను శుద్ధి చేసే ప్లాంటును ఏర్పాటు చేసింది. వ్యర్థాలతో ఎరువులను తయారు చేసి రైతులకు చౌక ధరలకు అందించి, పంట ఉత్పత్తులను పెంచేందుకు పూనుకుంది. ఈ నేపథ్యంలోనే మానవ వ్యర్థాలతో ఎరువుల తయారీ కేంద్రం (శుద్ధి ప్లాంటు) ప్రారంభానికి సిద్ధమైంది. మేడ్చల్ డంపింగ్ యార్డులో మానవ వ్యర్థాలతో ఎరువుల తయారీ కేంద్రానికి ప్రభుత్వం రూ.1.15 కోట్ల నిధులను మంజూరు చేసింది. శుద్ధి ప్లాంటు పనుల పూర్తితో త్వరలోనే ఎరువుల తయారీ కేంద్రాన్ని ప్రారంభించి వినియోగంలోని తీసుకురానున్నారు. నిండిన సెప్టిక్ ట్యాంకులలోని వ్యర్థాలతో ఎరువుల తయారీ ఈ శుద్ధి ప్లాంటు లక్ష్యం. బహిరంగ ప్రదేశాలలో మానవ వ్యర్థాలు పడవేయకుండా ఉండేందుకు ప్రభుత్వం ఎరువుల తయారీ కేంద్రాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. జిల్లాలో మొట్ట మొదటగా మేడ్చల్ పురపాలక సంఘం పర్యవేక్షణలో ఎరువుల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మేడ్చల్ పరిధిలోని వ్యర్థాలను ఎరువుల తయారీ కేంద్రానికి తరలించి ఎరువులు తయారు చేసి.. రైతులకు చౌక ధరలలో అందించనున్నారు.
రోజుకు వందలాది కిలోల తయారీ
మేడ్చల్ డంపింగ్ యార్డులో ఏర్పాటు చేసిన మానవ వ్యర్థాల ఎరువుల తయారీ కేంద్రంలో ప్రతి రోజు 400 కిలోల ఎరువులు తయారవనున్నాయి. దీనికి సంబంధించి 10కేడీఎల్డీ కెపాసిటీ ఉన్న ఎరువుల తయారీ కేంద్రంలో ప్రతి రోజు 10 వేల లీటర్ల మానవ మల వ్యర్థాలను తీసుకుంటారు. ప్రత్యేక యంత్రాల ద్వారా మల వ్యర్థాలను శుద్ధి చేసే క్రమంలో నీటిని వేరు చేస్తారు. మిగతా వ్యర్థాన్ని ఎరువుగా మార్చేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బెడ్లకు పంపిస్తారు. బెడ్లకు పంపించిన వారం రోజులలో ఎరువుగా మారుతుంది. వేరు చేసిన నీటి శుద్ధి తర్వాత 8000 లీటర్ల నీటిని వివిధ డంపింగ్ యార్డులలో ఉన్న చెట్లు, మొక్కలకు వినియోగించుకుని పచ్చందాలను సృష్టించనున్నట్టు ప్రాజెక్ట్ ఇంజనీరు రవి తెలిపారు.
చౌకగా రైతులకు ఎరువులు..
వ్యర్థాలతో తయారైన ఎరువులను రైతులకు చౌకగా అందించేందుకు మేడ్చల్ పురపాలక సంఘం ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. ఎరువులను మేడ్చల్ పురపాలక సంఘంతో పాటు డంపింగ్ యార్డులోనూ అందుబాటులో ఉంచేలా చూస్తున్నారు. వ్యర్థాలు బహిరంగ ప్రదేశంలో పడవేయకుండా ఉండటమే ఎరువుల తయారీ కేంద్ర లక్ష్యం. ఇళ్లల్లో సెప్టిక్ ట్యాంకుల నిండిన వారు మేడ్చల్ పురపాలక సంఘంలో సంప్రదించినట్లయితే ఎలాంటి రుసుం లేకుండా వ్యర్థాలను తీసుకుని మేడ్చల్ డంపింగ్ యార్డులోని ఎరువుల తయారీ కేంద్రానికి తరలించి ఎరువులుగా మార్చనున్నారు.
ఎరువుల తయారీ కేంద్రం త్వరలో ప్రారంభం
మేడ్చల్ డంపింగ్ యార్డులో మానవ వ్యర్థాలతో ఎరువుల తయారీ కేంద్రాన్ని త్వరలోనే ప్రారంభించనున్నాం. మానవ వ్యర్థాలు బహిరంగ ప్రదేశాలలో పడవేయకుండా ఉండేందుకు ప్రభుత్వం ఇలాంటి కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటుంది. ఇందుకు సంబంధించి 10 కేడీఎల్డీల కెపాసిటీతో ఎరువుల తయారీ కేంద్రం సిద్ధం చేశాం.
– రవి, ప్రాజెక్టు సీనియర్ ఇంజనీర్