బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం
ముషీరాబాద్, జనవరి 23: శతాబ్దాలు గడిచినా త్యాగరాజ కీర్తనలు అజరామరంగా నిలిచి సంగీత ప్రియులను అలరిస్తున్నాయని బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు అన్నారు. చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో ఆదివారం త్యాగరాజ స్వామి 175వ ఆరాధనోత్సవాలు ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని కళాకారులు, నగర సంకీర్తన చేసిన నాద స్వర బృందాన్ని సత్కరించారు. ప్రముఖ శాస్త్రీయ సంగీత గురువు గీత శిష్య బృందంచే త్యాగరాజ పంచరత్న కీర్తనలను లయబద్దంగా ఆలపించారు. గానసభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కథక్ కళాకారుడు అంజిబాబు, శ్రీమణి, చంద్రశేఖర్, గోపాల కృష్ణ, ఆచార్య గౌరీ శంకర్, బండి శ్రీనివాస్ పాల్గొన్నారు.