సిటీబ్యూరో, ఆగస్టు 8(నమస్తే తెలంగాణ)/చార్మినార్: తల్లి భారతి దాస్య విముక్తి కోసం ముక్త కంఠాలై.. స్వాతంత్య్రోద్యమంలో మమేకమైన ‘తెలుగు తేజాల’ చరిత్రను నేటి తరానికి తెలియజెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారి పోరాటం, త్యాగాలు మొదలైనవి స్వాతంత్య్ర తెలుగు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించిన అంశాలను స్మరించుకుందాం. 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సందర్భంగా మరొక్కసారి జాతీయోద్యమ వీరులు, త్యాగధనుల చరిత్రను నెమరేసుకుందాం.
జాతీయోద్యమంలో తెలుగు వీరుల చరిత్రపై సాలార్జంగ్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన ఛాయా చిత్రాల (తెలుగు ఫ్రీడం ఫైటర్స్) ప్రదర్శనను గవర్నర్ డాక్టర్ తమిళి సై సౌందర్ రాజన్ ముఖ్య అతిథిగా హాజరై సోమవారం ప్రారంభించారు. అనంతరం, ఆమె మాట్లాడుతూ, స్వాత ంత్య్ర పోరాటయోధుల చరిత్ర తెలుసుకోవడానికి యువత, విద్యార్థులు ప్రదర్శనను ఒక్కసారైనా తిలకించాలని అభిలషించారు.
జాతీయోద్యమ ముఖ్య ఘట్టాలైన గాంధీజీ ఉప్పు సత్యగ్రహం, 1943లో అండమాన్ నికోబార్ దీవుల్లోని పోర్టుబ్లెయిర్లోని జింఖానా గ్రౌండ్లో నేతాజీ మొదటిసారిగా భారత జాతీయ పతాకాన్ని ఎగురేసిన వర్ణన, కార్గిల్ విజయ గాథ, అంతర్జాతీయ వేదికలపై క్రీడాకారుల విజయోత్సవ చిత్రాలను ప్రదర్శనలో భాగస్వామ్యం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలోని జాతీయోద్యమ నేతలైన బూర్గుల రామకృష్ణారావు, కాళోజీ నారాయణరావు, సురవరం ప్రతాపరెడ్డి, కొండా లక్ష్మణ్ బాపూజీ, హయగ్రీవాచారి, పీవీ నర్సింహారావు, షోయబుల్లా ఖాన్, దేవులపల్లి వెంకటేశ్వరరావు లాంటి ఎందరివో చరిత్రలను ఫొటో ఎగ్జిబిషన్లో పెట్టారు. వారి పోరాట స్ఫూర్తి అందరినీ ఆలోచింపజేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి చెందిన జాతీయ జెండా రూపశిల్పి అయిన పింగళి వెంకయ్యతో పాటు విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు, అంతరిక్షంలో భారత త్రివర్ణ పతాకాన్ని ఎగరేసిన భారత వ్యోమగామి రాకేశ్ శర్మ, కార్గిల్లోని ద్రాస్ సెక్టార్ వద్ద టైగర్ హిల్స్ కొండలపై విజయ సూచకంగా జాతీయ పతాకాన్ని ఎగరేసిన సైనికుల ఫొటో సందర్భకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సాలార్జంగ్ మ్యూజియం డైరెక్టర్ నాగేందర్రెడ్డితో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు.