దేశంలోనే ఏ నగరాల్లో లేని విధంగా మురుగు జలాల శుద్ధి
వచ్చే దసరా కల్లా నూతన ఎస్టీపీ నిర్మాణాలు పూర్తవ్వాలి
జలమండలి అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష
సిటీబ్యూరో, డిసెంబరు 27 (నమస్తే తెలంగాణ ): దేశంలో ఎక్కడా లేని విధంగా నగరంలో మురుగునీటి శుద్ధి ప్రక్రియ జరుగుతున్నదని, 100శాతం మురుగును ప్రతి రోజూ శుద్ధి చేయడమే లక్ష్యంగా జలమండలి అధికారులు పనిచేయాలని మంత్రి కేటీఆర్ దిశానిర్ధేశం చేశారు. ఇప్పటికే మురుగునీటి శుద్ధిలో హైదరాబాద్ ముందంజలో ఉన్నదని, కొత్త ఎస్టీపీల నిర్మాణం కూడా పూరె్తైతే పూర్తిస్థాయిలో మురుగునీటి శుద్ధి జరుగనున్నదని అన్నారు. సోమవారం నానక్రామ్ గూడలోని హెచ్ఎండీఏ హెచ్జీసీఎల్ కార్యాలయంలో జలమండలి ఎండీ దానకిశోర్, ఇతర ఉన్నతాధికారులతో మంత్రి కేటీఆర్ పురోగతిలో ఉన్న మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణం, తాగునీటి పథకం పనులపై సమీక్ష నిర్వహించారు. జలమండలి చేపడుతున్న పనులపై ఆయన సమీక్ష జరిపారు. రూ.3866.21 కోట్ల అంచనాతో 31చోట్ల నూతనంగా మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టగా, ఇందులో 17 చోట్ల పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని అధికారులు ఈ సందర్భంగా కేటీఆర్కు వివరించారు. ఓఆర్ఆర్ ఫేజ్ -2 కింద రూ. 1200కోట్లతో తాగునీటి పథకం పనులు జరుగుతుందని అధికారులు చెప్పారు. నూతన ఎస్టీపీల నిర్మాణ పనులను వచ్చే దసరా నాటికల్లా పూర్తి చేసి మురుగుశుద్ధి ప్రక్రియను చేపట్టాలని అధికారులను మంత్రి కేటీఆర్ సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలోనే కాకుండా ఓఆర్ఆర్ గ్రామాల వరకు మురుగునీటి శుద్ధి ప్రక్రియ కొనసాగించాలని, ఇందుకు ఓఆర్ఆర్ అవతల కూడా జన సాంద్రత ఎకువుగా ఉన్న ప్రాంతాలను గుర్తించి మరిన్ని నూతన ఎస్టీపీల నిర్మాణానికి అంచనాలు రూపొందించాలని కేటీఆర్ తెలిపారు.
ఎస్టీపీల వద్ద ఉద్యానవనాలు తీర్చిదిద్దాలి
ఎస్టీపీలను పచ్చటి ఉద్యాన వనాలుగా చకటి ఆహ్లాదకర వాతావరణంతో మార్చాలని కేటీఆర్ చెప్పారు. ఎస్టీపీలు నగర వాసులకు విహార కేంద్రాలుగా తీర్చిదిద్దాలని ఆయన సూచనలు చేశారు. నగరం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో శివార్ల పైన కూడా దృష్టి పెట్టాలన్నారు. ముఖ్యంగా ప్రైవేట్ ఎస్టీపీలపైన కూడా సోషల్ ఆడిట్ సర్వే చేపట్టాలని ఎండీ దానకిశోర్ను ఆదేశించారు.
వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి ఓఆర్ఆర్-2 పూర్తి చేయాలి
ఓఆర్ఆర్-2లో భాగంగా చేపడుతున్న పనులను ఏడాదిలో పూర్తయ్యేలా చూడాలన్నారు. విస్తరించిన ఓఆర్ఆర్ గ్రామాల ప్రాంతాలకు నీటి సరఫరా, మౌలిక సదుపాయాలను అందించడం కోసం రూ .1200 కోట్లతోతో ఓఆర్ఆర్ గ్రామాల ప్రాజెక్ట్ ఫేస్-2 ను జలమండలి చేపట్టింది. ఈ ప్రాజెక్టు పనులపై మంత్రి కేటీఆర్ విస్తృతంగా చర్చించారు. వచ్చే డిసెంబర్ నాటికల్లా ఈ పథకం పనులను పూర్తి చేసి సమృద్ధిగా నీటి సరఫరా చేయాలని మంత్రి కేటీఆర్ చెప్పారు.