Hyderabad Police : ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారి నుంచి జరిమానాలను నేరుగా వారి ఫాస్టాగ్ ఖాతాల నుంచి వసూలు చేసేందుకు హైదరాబాద్ పోలీసులు యోచిస్తున్నారు. ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సున్ప్రీత్ సింగ్ వెల్లడించారు. ఈ వినూత్న విధానం అమలుచేసే విషయమై హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులతో చర్చిస్తున్నామని, దీనిపై వారి నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉందని తెలిపారు.
ఇటీవల సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ 20వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ఒక కార్యక్రమంలో సున్ప్రీత్ సింగ్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. “ప్రజలు, భాగస్వామ్యం, సాంకేతికత ద్వారా సురక్షితమైన రహదారుల నిర్మాణం” అనే అంశంపై జరిగిన చర్చా కార్యక్రమంలో ఆయన ప్యానలిస్ట్గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకుని ట్రాఫిక్ నిబంధనల అమలును మరింత పటిష్ఠం చేయడమే ఈ ప్రతిపాదన ప్రధాన ఉద్దేశమని వివరించారు.
కేవలం జరిమానాలు విధించడంవల్ల మాత్రమే వాహనదారుల ప్రవర్తనలో శాశ్వత మార్పు రాకపోవచ్చని, బాధ్యతాయుతమైన డ్రైవింగ్ను ప్రోత్సహించడానికి టెక్నాలజీ ఎంతో దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. గడిచిన రెండు దశాబ్దాలలో హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందడంవల్ల ట్రాఫిక్ రద్దీతోపాటు ప్రాణాంతక ప్రమాదాలు కూడా పెరిగాయని సున్ప్రీత్ సింగ్ ఆవేదన వ్యక్తంచేశారు. రహదారి భద్రత విషయంలో ప్రభుత్వంతోపాటు పౌరులకూ సమాన బాధ్యత ఉంటుందన్నారు.
మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థ, లాస్ట్-మైల్ కనెక్టివిటీ, మల్టీ-లెవల్ పార్కింగ్ సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ట్రాఫిక్ రద్దీని తగ్గించవచ్చని ఆయన సూచించారు. ప్రభుత్వ సంస్థలు, పోలీసులు, టెక్నాలజీ ప్రొవైడర్లు, పౌరుల మధ్య సమన్వయం, భాగస్వామ్యం పెరిగితేనే రహదారి భద్రత మెరుగుపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.