హుజూరాబాద్ : హుజూరాబాద్ లో అన్ని వర్గాల ప్రజలు టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కు మద్దతు తెల్పుతున్నారు. తాజాగా హుజురాబాద్ రా రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట్ర సివిల్ సప్లైస్ మినిస్టర్ గంగుల కమలాకర్ ను హుజురాబాద్ లో కలిసి రాబోయే ఎన్నికల్లో తమ మద్దతు టీఆర్ఎస్ కే అని తెలుపుతూ మద్దతు లేఖ అందజేసారు. ఈ సందర్బంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో రాష్ట్రంలో ధాన్యం సమృద్దిగా పండి రైతులకు, రైస్ మిల్లులకు పని దొరికిందన్నారు.
కానీ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో రాబోయే రోజుల్లో తీవ్ర సంక్షోభాన్ని రైతులతో పాటు మిల్లర్లు ఎదుర్కొంటారని ఆవేదన వ్యక్తం చేసారు. అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలపై విజ్ణాపన పత్రాన్ని అందజేసారు. ఈ వానాకాలం సీజన్ లో తమ ప్రాంత మిల్లర్లకు రెండున్నర లక్షల టన్నుల ధాన్యం కేటాయించాలని కోరారు. మిల్లులకు అందిస్తున్న ఎలక్ట్రిసిటీ పవర్ను 100 నుండి 150 హెచ్.పి సామర్ధ్యానికి పెంచాల్సిందిగా కోరారు. వారి కోరికల పట్ల సానుకూలంగా స్పందించిన మంత్రి అండగా ఉంటామని హామీనిచ్చారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ నేత్రుత్వంలోని సుస్థిర ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తుందని, కేవలం 24లక్షల మెట్రిక్ టన్నుల నుండి నేడు కోటి 41లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించి దేశానికే అన్నపూర్ణగా తెలంగాణ నిలిచిందన్నారు.
ఇంతటి ధాన్యరాశుల్ని నిర్ణీత సమయంలో మిల్లింగ్ చేయడానికి కృషి చేస్తున్న రైస్ మిల్లర్లను మంత్రి అభినందించారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మరింత ప్రోత్సాహం ప్రభుత్వం నుండి ఇస్తామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ గందె రాధిక – శ్రీనివాస్ , కొలిపాక నిర్మల – శ్రీనివాస్ హుజురాబాద్ రా రైస్ మిల్లర్ల ప్రతినిధులు పాల్గొన్నారు.