హైదరాబాద్ : హుజూరాబాద్ ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ అన్నారు. రాత్రి 7 గంటల వరకు చాలా చోట్ల పోలింగ్ ముగిసిందని చెప్పారు. 224, 237 పోలింగ్ కేంద్రాల్లో ఇంకా ఓటర్లు ఉన్నారని.. ఇప్పటి వరకు 86.33 శాతం పోలింగ్ నమోదైందని చెప్పారు. పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు బాగా చేశారని, కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఈవీఎంలను భద్రపరుస్తున్నట్లు పేర్కొన్నారు.
మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని, సీసీ కెమెరాల నిఘాలో స్ట్రాంగ్ రూమ్ల్లో ఈవీఎంలకు భద్రత కల్పించినట్లు పేర్కొన్నారు. అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ సీల్ చేస్తామని, కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర పోలీస్లు భద్రతను పర్యవేక్షిస్తారన్నారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద అభ్యర్థులు, లేదంటే ఏజెంట్స్ ఉండవచ్చన్నారు. 24 గంటల పాటు నిఘా ఉంటుందన్నారు. ఎన్నికల సందర్భంగా రూ.3.60కోట్ల నగదు, మద్యం సీజ్ చేశామని వివరించారు.