390 మంది ప్రాణాలు కాపాడిన లేక్ పోలీస్
నిరంతరం హుస్సేన్సాగర్ పరిసరాలలో పటిష్ట నిఘా
సమస్యను తెలుసుకొని.. కౌన్సిలింగ్ చేస్తున్న పోలీసులు
జీవితంలో చిన్న చిన్న వాటికి కుంగిపోవద్దని భరోసా
సిటీబ్యూరో, డిసెంబర్ 29 : మీరు చావొద్దు.. మీకు మంచి భవిష్యత్తుంది.. మీ వెనుక మీ కుటుంబం ఉంది.. మీ లక్ష్యాన్ని సాధించే సత్తా మీకుంది.. అధైర్య పడొద్దు.. ధైర్యంగా ముందుకు నడుద్దాం.. మీకు అండగా మేముంటామంటూ మనస్తాపంతో అతలాకుతల మవుతున్న జీవితంలో భరోసా కల్పిస్తూ లేక్ పోలీసులు అందరికీ ఆదర్శంగా నిలుస్తు న్నారు. ఆత్మహత్యా ప్రయత్నం చేసిన 390 మందిని గుర్తించి, వారి ప్రాణాలు రక్షించారు. రక్షించిన వారికి ప్రత్యేకంగా కౌన్సిలింగ్ నిర్వహించి, వారిలో మనోధైర్యాన్ని నింపుతూ.. కుటుంబ సభ్యులను పిలిపించి వారి సమస్యను వివరిస్తూ వారికి తిరిగి మంచి జీవితం ఇవ్వడంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. హుస్సేన్సాగర్ పర్యాటక ప్రాంతం కావడంతో అక్కడకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజుబుల్ పోలీసింగ్తో ఆత్మహత్యా ప్రయత్నా లను, నేరాలను కట్టడి చేస్తున్నారు.
ఎన్నో సమస్యలు.. వాటిని తట్టుకోలేక క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకోవాలని హుస్సేన్సాగర్ వద్దకు వచ్చేవారిని లేక్ పోలీసులు సమయస్ఫూర్తితో కాపాడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు, మద్యం మత్తులో భర్త వేధింపులు, మార్కులు తక్కువ వచ్చాయని, ప్రేమించిన వాడితో పెళ్లికాలేదని, అత్త వేధింపులు, ఆరోగ్యం బాగోలేదని, అనుకున్న పనులు జరగడం లేదని, డబ్బుంది కానీ ఎవరూ లేరు, డబ్బుంది ఆరోగ్యం కాపాడుకోలేకపోయాం.. ఇలా ఎన్నో కారణాలు ఆత్మహత్యకు పురిగొల్పుతున్నాయి. సమస్యలను అధిగమించలేక ఆత్మహత్య శరణ్యమనే భావనతో హుస్సేన్సాగర్ వద్దకు వచ్చే వారిలో పేద, మధ్య తరగతి, ధనవంతులు, ఉన్నత చదువులు చదువుకున్న వారు కూడా ఉంటున్నారు. లేక్ పోలీసులు నిరంతరం హుస్సేన్సాగర్ చుట్టూ పెట్రోలింగ్ చేస్తూ ఆత్మహత్యాప్రయత్నం చేసేవారిని గుర్తించి వారిని కాపాడుతున్నారు. వారి కష్టాల గురించి అడగగానే.. అవును నిజంగానే ఆత్మహత్య చేసుకోవాలని వచ్చాను… నాకు ఈ సమస్య ఉందంటూ పోలీసులకు చెబుతూ బోరుమంటున్నారు. సమస్యలు విన్న పోలీసులు ఇది పెద్ద సమస్య కాదంటూ ధైర్యం చెప్పి, స్టేషన్కు తరలించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించి, కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు. మరోసారి అలాంటి ప్రయత్నం చేయకుండా ఉండేందుకు వారిలో మానసిక ైస్థెర్యాన్ని నింపుతున్నారు.
మేమున్నామనే భరోసానిస్తూ..
హుస్సేన్సాగర్ చుట్టూ ఉన్న ట్యాంక్బండ్, ఎన్టీఆర్ పార్కు, నెక్లెస్రోడ్డు, బుద్ద విగ్రహాం తదితర ప్రాంతాలను చూసేందుకు, కొద్దిసేపు ఇక్కడ గడిపేందుకు ప్రతినిత్యం వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు. నగర నడిబొడ్డున్న ఉన్న హుస్సేన్సాగర్ చుట్టూ నేరాలు జరగకుండా, పర్యాటకులకు భద్రతగా మేమున్నామనే భరోసాను లేక్ పోలీసులు కల్పిస్తున్నారు. లేక్ పోలీస్స్టేషన్కు 45 మంది సిబ్బంది ఉంటారు. హుస్సేన్సాగర్ చుట్టూ మూడు షిప్టులలో నిరంతరం పెట్రోలింగ్ జరుగుతుంది. దీనికి తోడు మౌంటెడ్ పోలీసులు, సిటీ ఆర్మూడ్ మహిళా సిబ్బంది ఇక్కడ బందోబస్తు, స్థానిక పోలీసులతో కలిసి నేర నివారణలో పాల్గొంటుంటారు.
నిరంతరం ఉన్నతాధికారుల పర్యవేక్షణ
హుస్సేన్సాగర్ పర్యాటక ప్రాంతం కావడంతో ఇక్కడ పటిష్టమైన పోలీసు నిఘా ఉంటుంది. నిరంతరం సెంట్రల్ జోన్ జాయింట్ సీపీ విశ్వప్రసాద్, సైఫాబాద్ ఏసీపీ వేణుగోపాల్రెడ్డి పర్యవేక్షణ చేస్తుంటారు. లేక్పోలీసులు మూడు షిప్టులలో విధులు నిర్వహిస్తూ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటారు. అనుమానాస్పదంగా హుస్సేన్సాగర్ పరిసర ప్రాంతంలో కన్పిస్తే వెంటనే పోలీసులకు సమాచారం వస్తుంది. విజుబుల్ పోలీసింగ్ను పటిష్టంగా అమలు చేస్తున్నాం. ఆత్మహత్యకు ప్రయత్నించే వారిని కాపాడి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి, వాళ్లలో ధైర్యాన్ని నింపి, వాళ్ల కుటుంబసభ్యులకు అప్పగిస్తున్నాం. – మంజుల, లేక్ పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్