హైదరాబాద్/వరంగల్, మార్చి 31 (నమస్తే తెలంగాణ)/వరంగల్ చౌరస్తా: వరంగల్ ఎంజీఎం దవాఖానలో రోగిని ఎలుకలు కరిచిన ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నది. ఈ ఘటనపై వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు తీవ్రంగా స్పందించారు. తక్షణ విచారణకు ఆదేశించి, సాయంత్రానికల్లా నివేదిక తెప్పించారు. వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ శ్రీవత్స ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎంజీఎం సూపరింటెండెంట్ బీ శ్రీనివాసరావుపై బదిలీ వేటు వేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు వైద్యులను సస్పెండ్ చేశారు. జనరల్ మెడిసిన్ విభాగాధిపతిగా పనిచేస్తున్న డాక్టర్ చంద్రశేఖర్కు సూపరింటెండెంట్గా పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. ప్రజలకు వైద్యసేవలు అందించే విషయంలో నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. బాధితుడికి నాణ్యమైన వైద్యం అందించాలని సూచించారు.
హనుమకొండలోని భీమారానికి చెందిన కాడర్ల శ్రీనివాస్ కిడ్నీ, లివర్, గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. కొద్దిరోజుల పాటు ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందాడు. ఈ నెల 26న స్పృహ కోల్పోయిన స్థితిలో ఉన్న శ్రీనివాస్ను కుటుంబసభ్యులు ఎంజీఎంలో చేర్చారు. ఆర్ఐసీయూలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. 27న రాత్రి కుడిచేతి వేలు భాగంలో రక్తం కారడాన్ని గమనించిన అటెండెంట్ ఆర్ఐసీయూలోని డ్యూటీ డాక్టర్ల దృష్టికి తీసుకెళ్లాడు. ఎలుకలు కొరికి ఉంటాయనే అనుమానం వ్యక్తంచేశాడు. డాక్టర్లు శ్రీనివాస్కు చికిత్స అందించారు. తిరిగి బుధవారం రాత్రి కూడా శ్రీనివాస్ చేతివేళ్లు, కాలి మడమ వద్ద ఎలుకలు కొరకడంతో రక్తం కారింది. డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే వరుసగా రెండ్రోజులు ఎలుకలు కొరికాయని కుటుంబసభ్యులు ఎంజీఎం ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేశారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన ఆర్ఎంవో డాక్టర్ మురళి.. శానిటేషన్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఈ సంఘటన జరిగినట్టు సూపరింటెండెంట్కు ప్రాథమిక నివేదిక ఇచ్చారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ శ్రీవత్స ఎంజీఎంను సందర్శించి, విచారణ జరిపారు. శ్రీనివాస్ అటెండెంట్, కుటుంబసభ్యులు, దవాఖాన అధికారులు, ఆర్ఐసీయూలోని డ్యూటీ డాక్టర్, సిబ్బంది, శానిటేషన్ సిబ్బందితో వేరువేరుగా మాట్లాడి స్టేట్మెంట్లు రికార్డు చేశారు. హాజరు పట్టిక సహా ఇతర రికార్డులనూ పరిశీలించి, ప్రభుత్వానికి నివేదిక పంపారు.