రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలకు ఊపు
పెట్టుబడులు, ఉపాధిలో భారీ వృద్ధి
హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ (ఎంఎస్ఎంఈ)ల వృద్ధి వేగంగా పెరుగుతున్నది. 2014 నుంచి 2020 డిసెంబర్ నాటికి పెద్దసంఖ్యలో ఎంఎస్ఎంఈలు రిజిస్ట్రేషన్ కాగా, 13,379 సంస్థలు ఉత్పత్తులు ప్రారంభించాయి. వీటిలోని కుటీర పరిశ్రమల ద్వారా రూ.2,600 కోట్ల పెట్టుబడులు, 81,121 ఉద్యోగాలు లభించాయి. 4,923 చిన్నతరహా పరిశ్రమలు ఏర్పాటుతో రూ.11,865 కోట్ల పెట్టుబడులు, 1,31,942 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఎంఎస్ఎంఈలలో మధ్యతరహా పరిశ్రమల వాటా తక్కువగా ఉన్నది. 362 మధ్యతరహా పరిశ్రమలు ఏర్పాటుకాగా, రూ.4,000 కోట్ల పెట్టుబడులు, 30,493 ఉద్యోగాలు లభించాయి. ఎంఎస్ఎంఈల ఏర్పాటులో మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా 25.3 శాతం వాటాతో ప్రథమస్థానంలో ఉండగా, 8.4 శాతంతో కరీంనగర్, 6.6 శాతంతో రంగారెడ్డి రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.
ఎంఎస్ఎంఈలకు రాష్ట్రంలో టీ ఐడి యా, టీప్రైడ్ పథకాల ద్వారా రాయితీలు కల్పిస్తున్నారు. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ 2020-21 ఆర్థిక సంవత్సరంలో ప్రాధాన్య రంగాలకు రూ.1.22 లక్షల కోట్లు రుణాలు అందించాలని నిర్ణయించగా, అందులో 28.85 శాతం, అంటే రూ.35,197 కోట్లు ఎంఎస్ఎంఈలు దక్కించుకున్నాయి. తెలంగాణ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డ్, ఖాదీ అండ్ విజేల్ ఇండస్ట్రీస్ కమిషన్, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్స్ ఆధ్వర్యంలో 2020 ఏప్రిల్ ఒకటి నుంచి డిసెంబర్ 18 వరకు 836 యూనిట్లకు రూ. 8.1 కోట్ల మార్జిన్ మనీని విడుదలచేశారు.