హైదరాబాద్: రాష్ట్రంలోని శైవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కార్తిక మాసం తొలి సోమవారం (Karthika Somavaram) కావడంతో భారీ సంఖ్యలో భక్తులు ముక్కంటిని దర్శించుకుంటున్నారు. కార్తిక దీపాలు వెలిగిస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు. వరంగల్ జిల్లాలోని చారిత్రక వేయిస్తంభాల రుద్రేశ్వరాలయం, పాలకుర్తి సోమేశ్వర ఆలయం, కురవి వీరభద్రస్వామి ఆలయం, కాళేశ్వర ముక్తేశ్వర ఆలయాలు భక్తులతో కళకళలాడుతున్నాయి.
సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి దేవాలయంలో తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి పెరిగింది. స్వామివారి దర్శనానికి భారీగా భక్తులు తరలిరావడంతో క్యూలైన్లు నిండిపోయాయి. ఆలయ ముందు భాగంలో కార్తీక దీపాలను వెలిగించి భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. స్వామి వారికి మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం, అమ్మవారికి ప్రత్యేక పూజలను ఆలయ అర్చకులు నిర్వహించారు.
ఇక నల్లగొండ జిల్లాలోని చెర్వుగట్టు జడల రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచే పుణ్యక్షేత్రంలో బారులుతీరారు. రామలింగేశ్వరునికి రుద్రాభిషేకం, హోమం, అభిషేకాలు చేస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో కార్తిక దీపాలు వెలిగిస్తున్నారు.