చాలామందికి చిన్న వయసులోనే కీళ్లనొప్పులు వస్తున్నాయి. కీళ్ల దగ్గర ఉండే గుజ్జు (గ్రీజు) అరిగిపోకుండా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఏ విధమైన వ్యాయామాలు చేయాలి? – ఓ పాఠకురాలు
నిజమే. చాలామందిలో చిన్న వయసులోనే కీళ్ల నొప్పులు, ఒంటి నొప్పులు గమనిస్తున్నాం. దీనికి కారణం.. అసమతుల్య ఆహారం, జీవనశైలి లోపాలే. సాధారణంగా ఎముకలను కలిపి ఉంచే కీలు ప్రాంతంలో మెత్తటి దిండులా పనిచేసే మృదులాస్థితో పాటు సైనోవియల్ ఫ్లూయిడ్గా పిలిచే గ్రీజులాంటి పదార్థం ఉంటుంది. ఇది ఎందుకు తగ్గుతుందో కచ్చితంగా చెప్పలేం. కానీ ఆ తగ్గుదలను ఆపేందుకు, దాని పరిమాణాన్ని పెంచుకునేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి.
రోజూ ఓ గంట వ్యాయామం చేయాలి. నడక, పరుగులాంటివి సాధన చేయాలి. మైదాలాంటి ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి సరైన పోషకాలు అందవు. సమతులాహారం కొరత కూడా ఓ కారణమే. అందుకే క్యాల్షియం అధికంగా ఉండే పాలు, పాల పదార్థాలు, నువ్వులు, ముల్లంగి, పాలకూర, బ్రకోలీ, గుడ్డు మొదలైనవి ఆహారంలో భాగం చేసుకోవాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి. గోంద్లాంటి ప్రకృతి సిద్ధమైన బంకలు, బెండకాయలాంటి జిగురు కూరలు మృదులాస్థి కణజాలాన్ని, తద్వారా సైనోవియల్ ఫ్లూయిడ్ను పెంచడంలో సాయపడతాయి. రోజూ ఉదయం పూట ఓ పావు గంట ఎండలో ఉండాలి. విటమిన్-డి ఎముకల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శరీరం క్యాల్షియంను శోషించుకునేందుకు కూడా సాయపడుతుంది.
– మయూరి ఆవుల
న్యూట్రిషనిస్ట్
Mayuri.trudiet@gmail.com